వేల్పూర్, జనవరి 3 : ఉమ్మడి జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి .. పోలీసు అధికారులను ఆదేశించారు. పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఆరోగ్యకర సమాజాన్ని పాడు చేస్తున్న గంజాయి మహమ్మారిని అంతమొందించాలన్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజు, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డితోపాటు పలువురు పోలీసు అధికారులు వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంజాయి సాగు, అక్రమ రవాణా తదితర అంశాలపై పోలీసు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కొద్దిరోజులుగా తరచూ తన దృష్టికి వస్తున్న గంజాయి వినియోగంపై పోలీసు అధికారులను మంత్రి అడిగి తెలుసుకొన్నారు. గంజాయి అసలు ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది.. సరఫరా చేసే ముఠా సభ్యులు ఎవరు? మహమ్మారి బారిన పడిన వాళ్లు ఎవరు? అంతమొందించడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కూలంకషంగా చర్చించారు.
సరఫరాదారులకు కఠిన శిక్ష పడేలా చూడాలి
యువత భవిష్యత్తు నాశనం చేస్తూ..సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయికి అడ్డుకట్ట వేయాలని, ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. గంజాయి సాగు, సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్టు కేసులు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకొని గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాని సూచించారు.
గంజాయి సాగుకాకుండా చూడాలి..ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి మంత్రి ఆదేశం
బాల్కొండ నియోజక వర్గంలో కొన్ని ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎక్కడి నుంచి వస్తోందని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం లింగట్ల, బోర్గాం గ్రామాల నుంచి వస్తోందని, నిఘా పెంచామని పోలీసు అధికారులు వివరించారు. వెంటనే మంత్రి ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్తోఫోన్లో మాట్లాడారు.ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సాగు కాకుండా, సరఫరా కాకుండా చూడాలని, సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలనకు సీఎంకేసీఆర్ కఠిన చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గంజాయి సాగు చేసే వారికి రైతుబంధు కట్ చేస్తామని, కఠిన శిక్షలు కూడా ఉంటాయన్న హెచ్చరికలను వారికి తెలియ జేయాలని సూచించారు.ప్రజల్లో ముఖ్యంగా యువతలో గంజాయితో కలిగే దుష్పరిణామాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి చైతన్యవంతులను చేయాలన్నారు. ఎక్కడికక్కడ ప్రజలే కథా నాయకులైతే అనుకున్న లక్ష్యం దిశగా పయనిస్తామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, బాల్కొండ నియోజక వర్గ ఎస్సైలు పాల్గొన్నారు.