బాన్సువాడ, అక్టోబర్ 28: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. మరికొన్నింటికి ప్రాథమిక పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేసింది. అయితే ఏండ్లుగా సర్కారు కొలువు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న యువతీ యువకులు ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో శిక్షణ పొందారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న నిరుద్యోగ యువత పట్టణాలకు వెళ్లి కోచింగ్ తీసుకోగా, అంతంత మాత్రంగానే ఉన్నవారు చేయూత కోసం ఎదురుచూశారు. ఆ సమయంలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నిరుద్యోగులకు అండగా ఉన్నారు. ఉచితంగా కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగుల బాసటగా నిలిచారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యువత.. పలు ఉద్యోగ ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించి సర్కారు కొలువు దారిలో ఒక అడుగు ముందుకేశారు.
అండగా నిలిచిన పీబీఆర్…
ఆర్థిక పరిస్థితులు బాగోలేక, శిక్షణ పొందాలని ఆసక్తి ఉన్న వేలాది నిరుద్యోగ యువతకు అండగా నిలిచారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంతోపాటు రుద్రూర్ మండల కేంద్రంలో పీబీఆర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ అందించారు. అందులో చాలా మంది ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించారు. గతంలో పీబీఆర్ కోచింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ పొందిన యువత పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్, ఎస్జీటీ ఉపాధ్యాయులు, ఎస్సై ఉద్యోగాలను సాధించారు. 2018-19, 2021-22 సంవత్సరాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దారని యువత కొనియాడుతున్నారు.
నాణ్యమైన బోధన.. ఉచితంగా మెటీరియల్
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ మండల కేంద్రాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి.. పీబీఆర్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్కు చెందిన పీజేఆర్ టీచింగ్ ఫ్యాకల్టీతో నాణ్యమైన బోధన అందించారు. సుమారు 12 మందితో అభ్యర్థులకు వివిధ అంశాల్లో తర్ఫీదునిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులకు నిత్యం ఉచితంగా మధ్యాహ్న భోజన వసతితోపాటు టీ, స్నాక్స్ అందజేశారు. అదేవిధంగా అభ్యర్థులకు దోహదపడేలా సుమారు రూ.5వేల నుంచి రూ.6వేల విలువజేసే స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేశారు. 2018-19 సంవత్సరంలో శిక్షణ పొందిన వారిలో 50మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడగా, ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి పోచారం భాస్కర్రెడ్డి స్వయంగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. 2021-22లో శిక్షణ పొందిన వారిలో పోలీస్ కానిస్టేబుల్స్కు 261, సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షల్లో 66 మంది ఉత్తీర్ణులై మెయిన్స్కు అర్హత సాధించడం విశేషం.
మంచిమార్గం చూపాలన్నదే నా ఆకాంక్ష…
ప్రతి కుటుంబంలో యువత బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని, మంచిస్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షిస్తారు. చదువుకోవాలని ఉన్న చాలా మందికి ఆర్థిక పరిస్థితులు అడ్డు గా ఉంటాయి. అలాంటి యువత కోసం పీబీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మంచి టీచింగ్ ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిం చాం. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రాథమిక పరీక్షల్లో చాలా మంది అర్హత సాధించారు. చాలా ఆనందంగా ఉన్నది. నావంతు సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి.
– పోచారం భాస్కర్రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్
కష్టపడితే విజయం బానిసవుతుంది..
కష్టపడితే విజయం బానిసవుతుం ది.. అదే చేయించారు పీబీఆర్ కోచింగ్ సెంటర్లో. నాతోపాటు చాలా మందికి ప్రతి రోజూ మంచి భోజనం, టీ, స్నాక్స్ , రూ.6వేల విలువగల మెటీరియల్ అందజేశారు. ఇంట్లో ఉన్నా సమయానికి చదువు, భోజనం సాగేది కాదు. పీబీఆర్ కోచింగ్ సెంటర్లో సకల సౌకర్యాలతో శిక్షణ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. భాస్కర్ రెడ్డి అన్నకు రుణపడి ఉంటాం.
– ప్రేమ్సింగ్, మొగులన్పల్లి
స్పీకర్ పోచారం సార్కు మాటిచ్చాను..
పీబీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ ప్రారంభం రోజున స్పీకర్ పోచా రం సార్ వచ్చారు. సార్ చెప్పిన మాటలతో అప్పుడే నిర్ణయించుకున్నా..సార్కు మాటిచ్చాను. నేను పోలీస్ యూనిఫాంతో వస్తానని. పోచారం సార్ కుటుంబాన్ని మర్చిపోను. రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇచ్చి ఎంతో మంది నిరుద్యోగ యువతను ఆదుకున్న దేవుడు భాస్కర్ అన్న. మా చెల్లికి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది.
– శేషు, ఇబ్రహీంపేట్
‘ఎస్సై, కానిస్టేబుల్’ క్వాలిఫై అయ్యా..
నేను పీబీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాను. ఇటీవల విడులైన ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్కు అర్హత సాధించాను. భాస్కర్రెడ్డి అన్నయ్య మంచి టీచింగ్ ఫ్యాకల్టీతో బోధన అందించారు. కసితో చదివాను. కోచింగ్ సెంటర్లో చెప్పిన పాఠాలు, అందజేసిన స్టడీ మెటీరియల్ చాలా ఉపయోగపడ్డాయి. భాస్కర్ రెడ్డి అన్నను జీవితంలో మర్చిపోము.
– పి.సంధ్య, బాన్సువాడ
సొంత పిల్లలుగా శిక్షణ ఇప్పించారు..
పీబీఆర్ కోచింగ్ సెంటర్ మాకు సొంత ఇంటిలాగా ఉండేది. ఏ విషయంలో రాజీలేకుండా భాస్కర్ రెడ్డి అన్నయ్య శిక్షణ ఇప్పించారు. స్పీకర్ పోచారం సార్, భాస్కర్ రెడ్డి అన్న చాలా సార్లు చెప్పకుండా వచ్చి టీచింగ్ స్టాఫ్ చెప్పే పాఠాలను పరిశీలించే వారు. పీబీఆర్ అన్న మనుషులు కోచింగ్ సెంటర్కు వచ్చిన అభ్యర్థులకు ఇబ్బందుల్లేకుండా చూసుకు న్నారు. నేను కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీలో పాస్ అయ్యాను. మెయిన్స్ కు క్వాలిఫై అయ్యాను. బయట కోచింగ్ తీసుకుంటే లక్షకు పైగా ఖర్చు అయ్యేది.
– సీహెచ్ స్వప్న, బోర్లం
నా అదృష్టంగా భావిస్తా..
బాన్సువాడలో పీబీఆర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తా. చాలా మంది కోచింగ్ తీసుకోవాలి, జాబ్ సాధించాలని ఆశ ఉంటుంది. కానీ దానికి తగ్గట్టు ఖర్చు అవుతుంది. నయా పైసా ఖర్చు లేకుండా బాన్సువాడలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి సొంత ఖర్చుతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పేద నిరుద్యోగులకు వరం అందించారు. శిక్షణతోపాటు నిత్యం నాణ్యమైన భోజనం పెట్టారు. అందరికీ స్టడీ మెటీరియల్ అందజేశారు.
– అఖిల, బీర్కూర్
మెయిన్స్కు క్వాలిఫై అయ్యా..
బాన్సువాడలో పీబీఆర్ కోచింగ్ సెంటర్ అంటే అంతంత మాత్రంగానే ఉంటుందని అనుకున్నా. కానీ, కార్పొరేట్కు దీటుగా శిక్షణ ఇచ్చారు. బంధువులు కూడా రూపాయి ఇచ్చే రోజులు కావు. కానీ స్పీకర్ పోచారం సార్ కుటుంబీకులు మాకు నిరుద్యోగ యువతకు అండగా నిలిచారు. ఉచితంగా కోచింగ్ ఇప్పించి మేము ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయ్యి, మెయిన్స్కు క్వాలిఫై అయ్యేలా తీర్చిదిద్దారు. నేను ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయ్యాను. భాస్కర్రెడ్డి సార్కు రుణపడి ఉంటాం.
– పరుగొండ శిరీష, బాన్సువాడ
చాలా సంతోషంగా ఉంది..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఎంతో దూరం వెళ్లి కోచింగ్ తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. బాన్సువాడలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సార్ పీబీఆర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో బెంగ లేకుండా పోయింది. మంచి శిక్షణతోపాటు, స్టడీ మెటీరియల్, నాణ్యమైన భోజనం అందించారు. ఫ్యాకల్టీ క్లాస్ చెప్పే సమయంలో భాస్కర్ సార్ ఆకస్మికంగా వచ్చి పరిశీలించేవారు. అర్థమవుతుందా లేదా అంటూ స్పీకర్ సార్, భాస్కర్రెడ్డి సార్ అడిగే వారు.
– కుంచాల స్వర్ణలత, బాన్సువాడ