కొత్తరూపు సంతరించుకోనున్న కామారెడ్డి మున్సిపాలిటీ
జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు కార్యక్రమాలు
ప్రతి వార్డుకూ ప్రత్యేక అధికారుల నియామకం
పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
విద్యానగర్,మే 29: పట్టణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగో విడుత పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. పట్టణ ప్రగతిని ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తున్నది. గతంలో మూడు విడుతలుగా పట్టణంలోని 49 వార్డుల్లో పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు,డంపింగ్ యార్డ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం,విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు, ఇంటి పన్నుల వసూలు వంటి కార్యక్రమాలను చేపట్టింది. గతంలో పల్లెప్రగతి విజయవంతం కావడంతో పట్టణాలను సైతం అద్దంలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులకు పట్టణప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు 16రోజుల పాటు కార్యక్రమం సాగనున్నది. ఈ మేరకు అధికారులకు సైతం శిక్షణ ఇచ్చారు. ఇటీవల కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ కమిషనర్లకు పట్టణప్రగతిపై అవగాహన కల్పించారు. వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. వార్డు ఇన్చార్జీలను నియమించారు.
ప్రగతి వెల్లివిరిసేలా..
పల్లెలకు దీటుగా పట్టణాల్లో సైతం ప్రగతి వెల్లివిరిసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. పట్టణాల్లోని వార్డులన్నీ పరిశుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకుంటున్నది. మురికి కాలువల నుంచి దుర్గంధం రాకుండా, నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. రోడ్లపై గుంతలు కనిపించకుండా మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రజల నుంచి పన్ను వసూలు చేయడంతోపాటు వసతులు సైతం కల్పించడంతో పట్టణ ప్రగతి సాధ్యమవుతుంది.
జూన్ 3 నుంచి ప్రారంభం..
పట్టణ ప్రగతిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చేపట్టే పనుల కార్యాచరణ రూపొందించింది. కామారెడ్డి పట్టణంలో 49వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో నాలుగు కమిటీలను ఎన్నిక చేయనున్నారు.యూత్, మహిళా, సీనియర్ సిటిజన్, ప్రముఖుల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీలో 15మంది సభ్యులు ఉంటారు. నాలుగు కమిటీల్లో మొత్తం 60మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి వార్డునూ ఎక్స్రే తీస్తారు. వార్డులో ఏర్పాటు చేయనున్న నాలుగు కమిటీలకు స్థానిక కౌన్సిలర్లు చైర్మన్గా,వార్డుకు నియమించే పురపాలనాధికారి, జిల్లా అధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్యం, కరెంట్ తదితర సమస్యలను పరిష్కరించనున్నారు.
పక్కా ప్రణాళికతో ముందుకు..
పల్లె ప్రగతి మాదిరి పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు 16 రోజులపాటు పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాం. ప్రజలు పట్టణ ప్రగతిలో పాలుపంచుకోవాలి.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి.
పట్టణ ప్రగతి ప్రణాళికలో చేయాల్సిన పనులు