డిచ్పల్లి, ఏప్రిల్ 24 : డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్కన ఘన్పూర్ గ్రామం ఉంటుంది. పేరుకు డిచ్పల్లి మండల కేంద్రమైనా.. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఘన్పూర్లోనే ఉంటాయి. దీంతో ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఘన్పూర్కు వెళ్లాల్సి ఉండగా, అక్కడికి వెళ్లాలంటే రైలు పట్టాలు దాటాల్సిందే. రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైల్వే గేట్ ఉంది. ఆ గేటు గుండా ఘన్పూర్కు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిందే. అదే రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న పట్టాలు దాటితే 10 నిమిషాల్లో ఘన్పూర్ చేరుకోవచ్చని ఇక్కడి ప్రజల అంటున్నారు. ఇక్కడి ప్రజలు వివిధ పనుల కోసం ఎప్పుడూ రైల్వే స్టేషన్ పట్టాలు దాటుతున్నారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఎంతో మంది ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ప్రమాదాలు జరుగవని, తమకు బాధలు తప్పుతాయని ప్రజలు వేడుకుంటున్నారు.
పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సమయంలో గతంలో మధుయాష్కీ గౌడ్, ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న మధుయాష్కీగౌడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఏ మాత్రం కృషి చేయలేదు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీ అర్వింద్ సైతం అదే రీతిలో వ్యవహరిస్తున్నాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే స్పందించడం తప్ప… ఏ మాత్రం ఆచరణకు కృషి చేయడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిచ్పల్లి రైల్వేస్టేషన్లో జరిగిన ఓ ప్రమాదంలో బాలుడి కాలు తెగి పడిపోయింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించా లని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు వినతిపత్రం అందజేశారు.
డిచ్పల్లి మండల కేంద్రమైన ప్రభుత్వ కార్యాలయాలన్ని ఘన్పూర్ పరిధిలో ఉన్నాయి. రైల్వేస్టేషన్కు అవతలి వైపు ఉన్న ఈ గ్రామం పరిధిలోనే తహసీల్దార్, ఎంపీడీవో, ఏఈవో, పీహెచ్సీతో సహా జూనియర్ కళాశాల ఉన్నాయి. వీటిల్లో కార్యకలాపాల నిమిత్తం ఉద్యోగులతో సహా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఆటోలు, బస్సుల్లో మండల కేంద్రానికి వస్తుంటారు. రైల్వేస్టేషన్ సమీపంలో వాహనాలు దిగి సదరు కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు.
రైల్వేస్టేషన్ నుంచి ఘన్పూర్ వరకు స్థానికంగా ఎలాంటి ఆటోలు ఉండవు. ఘన్పూర్, ముల్లంగి తదితర ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వారు సైతం పట్టాలు దాటక తప్పట్లేదు. ఈ క్రమంలోనే వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో ఎనిమిది మంది మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు.
ఇక్కడ షెడ్డు ఏర్పాటయ్యాక రైళ్ల రద్దీ పెరిగింది. ప్రజల రాకపోకలు ఎక్కువయ్యాయి. మరోవైపు ఇక్కడే డ్రైపోర్టు ఏర్పాటు అంశంపైనా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అత్యంత కీలకమైన ఈ స్టేషన్లో పాదాచారుల వంతెన ఏర్పాటు అత్యవసరంగా మారింది. స్థానిక నేతలు సమన్వయంతో పనిచేస్తే ఈ సమస్య త్వరలోనే తీరే అవకాశముంది.
స్టేషన్ పరిధి దాటి ఘన్పూర్కు వెళ్లే మార్గం ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారింది. రాత్రివేళల్లో చిల్లర దొంగల బెడద ఎక్కువవుతోంది. ఈ మార్గాన్ని బాగు చేయించి ఇరువైపులా లైట్లు ఏర్పాటు చేయించాల్సి ఉంది. నిఘాపరంగా సీసీ కెమెరాలు బిగించాల్సి ఉంది