ఖలీల్వాడి, మే 5 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొం డ, ఆర్మూర్, జగిత్యాల్, కోరుట్ల నియోజకవర్గాల ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మూడు నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు, ప్రజలు పాత కలెక్టరేట్ గ్రౌండ్, ఇరిగేషన్ వాటర్స్ ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్, ఆర్టీసీ ఎల్లమ్మగుట్ట వద్ద వాహనాలను నిలుపుకోవచ్చని తెలిపారు. బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల నుంచి వచ్చే వారు ఐటీఐ గ్రౌండ్, శైలజ గ్రౌండ్లో వాహనాలు నిలుపుకోవాలని సూచించారు.
లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం కేసీఆర్ వస్తున్నారని, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎలా నష్టపోతుందో ప్రజలకు వివరించడానికి కేసీఆర్ వస్తున్నారని పేర్కొన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసంచేసిందన్నారు. పంటలకు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారిని పట్టించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పార్టీ నాయకుడు బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీలు పాల్గొన్నారు.