బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 16 : గురుకుల సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల గేటు ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం ఆందోళనకు దిగారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని గేటు ఎదుట బైఠాయించారు.
ఇటీవల పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థినిని వరుసకు అన్న అయ్యే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి బయటికి తెసుకెళ్లిన ఘటన ఆందోళన కలిగించిందని తల్లిదండ్రులు గుర్తుచేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే సదరు యువకుడు లోపలికి వచ్చాడని ఆరోపించారు. ఈ విషయమై సబ్ కలెక్టర్ తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడారు. పాఠశాలను సందర్శించి, అక్కడే ఒక రోజు బస చేస్తానని భరోసా ఇచ్చారు.