Kamareddy | ఉమ్మడి జిల్లాలో మరో కొత్త మండలం పురుడు పోసుకున్నది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం నుంచి పాల్వంచ కొత్త మండలంగా ఏర్పాటైంది. మొదటి నుంచి పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్త మండలాలు, పంచాయతీలు ఏర్పాటయ్యాయి. తాజాగా ప్రజల కోరిక, పాలనాసౌలభ్యం కోసం పాల్వంచను మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన మాట మేరకు పాల్వంచ మండలం ఏర్పాటు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరిందని సంబురాలు జరుపుకొంటున్నారు.
నిజామాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనావికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. మా చారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయాన్ని ప్రకటించింది. కొద్ది నెలల క్రితమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాలను ఏర్పాటు చేసి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పాల్వంచ మండల ఏర్పాటు ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపింది. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పా టు చేసింది. ఈ క్రమంలోనే మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి.. కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. అలాగే, మండలాలు, పంచాయతీల ఏర్పాటుతో పరిపాలన ప్రజల చెంతకు చేరింది. సుపరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల సంక్షేమం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో పాలనా భవనాలు ప్రారంభమయ్యాయి. గతంలో కలెక్టరేట్, రెవెన్యూ, డీటీవో, డీఈవో తదితర జిల్లా స్థాయి కార్యాలయాలు మూలకొకటిగా విసిరేసినట్లుగా ఉండేవి. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, నూతన మండలాలను నెలకొల్పడం ద్వారా ప్రజా పరిపాలన మరింతగా ప్రజలకు చేరువయ్యింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక మార్పులు సం భవించాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నూతన పంచాయతీలు, తండాలను గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లను, నూతన మండలాలను సైతం ఏర్పాటు చేశారు. 2016 అనంతర కాలంలో ఆయా చోట్ల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని మండలాలు సైతం పురుడు పోసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్యే నాలుగు మండలాలు కొత్తవి ఏర్పాటు కావడంతో 33 మండలాలతో పరిపాలన కొనసాగుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ మధ్యే 23వ మండలంగా డోంగ్లి ఏర్పాటైంది. తాజాగా 24వ మండలంగా పాల్వంచ పురుడు పోసుకున్నది. ఇన్నాళ్లు మాచారెడ్డి మండల పరిధిలో ఉన్న పాల్వంచ, ఎలుపుగొండ, వాడి, ఫరీద్పేట్, బండారామేశ్వరపల్లి, ఇసాయిపేట్, దేవన్పల్లి, పోతారం, భవానిపేట్, సింగరాయ్పల్లి గ్రామ పంచాయతీలతో కొత్తగా పాల్వంచ మండలం ఆవిర్భవించింది.
కామారెడ్డి నియోజకవర్గంలో ఇది వరకు రాజంపేట, బీబీపేట మండలాలు నూతనంగా ఏర్పాటు కాగా, వీటి సరసన పాల్వంచ చేరింది. దాదాపు నాలుగైదేండ్లుగా పాల్వంచ నూతన మండలం ఏర్పాటు ప్రతిపాదన కొనసాగుతున్నది. 2019, మార్చి 30న రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం మండల ఏర్పాటుపై ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కృషితో ఎట్టకేలకు పాల్వంచ మండలం కావడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో మండలాల సంఖ్య 57కు చేరింది.
2001 నుంచి తెలంగాణ కోసమే ఆలోచించే కేసీఆర్ ఉద్యమ పథాన దూకి కార్యక్షేత్రంలో పని చేస్తున్న సందర్భంలో అనేక చేదు అనుభవాలను చూశారు. తెలంగాణ జీవన స్థితిని కళ్లారా చూసిన ఆయన.. ఆనాటి దుస్థితిని పూర్తిగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ఆత్మైస్థెర్యంగా నిలిచి వెన్నుచూపని ఉద్యమకారుడిగా నిలిచిన కేసీఆర్.. పునర్నిర్మాణధారిగా మారి నూతన తెలంగాణను ఆవిష్కరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటు, కొత్త జీపీలు, మండలాల ఆవిర్భావం తద్వారా పరుగులు తీస్తున్న పరిపాలన తీరే ఇందుకు నిదర్శనం. 2016, అక్టోబర్ 11న ఆవిర్భవించిన కామారెడ్డి జిల్లాలో 323 గ్రామ పంచాయతీలుంటే, ఇందులో 11 పంచాయతీలు ఆయా మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. మిగిలిన 312 పంచాయతీలకు తోడు 214 కొత్త జీపీలతో మొత్తం పంచాయతీల సంఖ్య 526కు చేరింది. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా దాటిన ప్రతీ తండాను జీపీగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఏకంగా 116 తండాలకు మహర్దశ కలిగింది. 214 కొత్త జీపీలు ఏర్పడగా అందులో 116 తండాలకే పంచాయతీ హోదా కలగడం విశేషం. జిల్లా ఆవిర్భావం సమయంలో 22 మండలాలు ఉండగా, వీటి సంఖ్య 24కు చేరింది. జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ నుంచి డోంగ్లి, తాజాగా కామారెడ్డి నియోజకవర్గంలో మాచారెడ్డి నుంచి పాల్వంచ ఏర్పాటైంది. నూతన మండలాల మూలంగా పరిపాలన సౌలభ్యం పెరిగి క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, లబ్ధిదారులకు మేలు చేకూరనున్నది.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేపడుతున్నది. కేసీఆర్ సర్కారు అధికారంలోకి రాగానే కరెంట్ సమస్య, తాగునీటి గోస లేకుండా చేసింది. అలాగే, కొత్త పంచాయతీలు, మండలాల ఏర్పాటుతో పాటే వాటి అభివృద్ధికి దండిగా నిధులు ఖర్చు చేస్తున్నది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. ఊరూరా సీసీరోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, హరితవనాలు ఏర్పాటయ్యాయి. పట్టణాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి ఫలాలు కండ్ల ముందర కనబడుతున్నాయి. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు.
ఒకప్పుడు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలంటేనే గగనమయ్యే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలను గుర్తించి వాటికి అనుగుణంగానే నిర్ణయాలు వెలువడుతున్నాయి. అందుకు ఉదాహారణే పాల్వంచ మండలం ఏర్పాటు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గుర్తించి ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మరో మండలం ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది. నూతన మండలం పరిధిలోని ప్రజలందరికీ అభినందనలు.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్
పాల్వంచ మండలం కావాలని మా ప్రాంత వాసుల ఎన్నో ఏండ్ల కల. మండలంగా చేస్తూ జీవో జారీ చేయడం ఎంతో అనందంగా ఉంది. ప్రత్యేక మండలం ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు మండల వాసుల తరపున కృతజ్ఞతలు
– కూచని శేఖర్,బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాల్వంచ.
పాల్వంచ మండలంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, కృషి చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్కు రుణపడి ఉంటాం. పాల్వం చను మండలంగా ఏర్పాటు చేయడంతో మా గ్రామాల ప్రజలకు మాచారెడ్డి వెళ్లాల్సిన భారం తగ్గింది.
– రమేశ్గౌడ్,భవానీపేట ఉపసర్పంచ్.
ప్రభుత్వం గ్రామాలభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. చిన్న గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించడంతో పాటు నూతన మండలాల ఏర్పాటుతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. పాల్వంచను మండలంగా ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బట్ట వెంకట్రాములు,ఫరీద్పేట.