కమ్మర్పల్లి, డిసెంబర్ 28: ఒకప్పుడు చుక్క నీరు లేక తుమ్మ మొద్దులు, పచ్చి నేల కనిపించని ఎస్సారెస్పీ వరద కాలువ ప్రస్తుతం మూడు కాలాలు మినీ జలాశయంలా మారి యాసంగిలో సైతం రైతుకు రంది లేకుండా చేసింది. నిరుపయోగమైన కాలువగా ఉండి వానకాలంలో సైతం రైతుకు సంపూర్ణంగా ఉపయోగపడే స్థితిలో లేని వరద కాలువ స్వరాష్ట్రం సాకారమయ్యాక సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో యాసంగి సాగుకు సైతం ఢోకా లేని సజీవ సాగు వనరుగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలపాటు వట్టి పోయిన వరద కాలువ టీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీటి రంగ అభివృద్ధికి పెద్దపీట వేయడంతో నిండుకుండలా మారిపోయింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాలువలోంచి చెరువులకు ఎక్కువ నీటిని.. అవసరమైనంత కాలం చెరువులకు తరలించుకునేలా తక్కువ ఎత్తులో నిర్మించిన పెద్ద తూములతో వరద కాలువ నిత్య జలప్రదాయినిగా నిలిచింది.
ఏడేండ్ల క్రితం గోస..
వరద కాలువ కింద ఏడేండ్ల క్రితం వరకు రైతుల బీడు భూములు కనిపించేవి. కాలువ వెంట అక్కడక్కడా బోరు బావుల కింద సాగు జరిగినా భూగర్భ జలాలు లేక, చాలీచాలని కరెంటు, లో వోల్టేజీ సమస్యతో బోరు మోటార్లు కాలిపోయి పండిన పంట తక్కువ..ఎండిన పంట ఎక్కువ అన్నట్లు ఉండేది. యాసంగి సీజన్లోనైతే కాలువ వెంట రెండు వైపులా పంట భూములు ఎండిన పంటలకు చిరునామాగా ఉండేవి.
సీన్ మారింది..
బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) సర్కారు రావడం..సాగు నీటిరంగానికి పెద్దపీట వైసే కేసీఆర్ సీఎం కావడం, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డితో కలిసి వరద కాలువ దుస్థితిని కండ్లారా చూసిన వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, మంత్రిగా రావడంతో కష్టాల సాగు సీన్లు కట్ అయ్యాయి. నిండు కుండలా వరద కాలువ, పునర్జీవ పథకంతో 300 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం జలాలను ఉల్టా పారించి వరద కాలువను ఎప్పుడు కావాలంటే అప్పుడు నింపుకోవడం, చెరువులు నిండుగా ఉంచుకోవడం, యాసంగిలో సాగు జోరు లాంటి సీన్లే ఉన్నాయిప్పుడు.
నిండుకుండలా..
ఎస్సారెస్పీ వరద కాలువను వినియోగించుకుంటూ..ఆ కాలువ గుండానే కాళేశ్వరం జలాలను ఉల్టా పారిస్తూ ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిర్మాణం చేపట్టారు. దీంతో వరద కాలువ మూడు కాలాలు పుష్కలంగా నీళ్లుండే మినీ జలాశయంగా మారింది. గతంలో వరద కాలువలో కాలువ అడుగు భాగం నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉండేవి. నిండుకుండలా మారిన కాలువ నుంచి రైతులకు పుష్కలంగా నీరిందించాలన్న లక్ష్యంతో కమ్మర్పల్లి మండలంలో నాగాపూర్, ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, పాలెం, దొన్కల్, వేల్పూర్ మండలం అంక్సాపూర్, పోచంపల్లి, బాల్కొండ మండలం వన్నెల్-బి వద్ద కేవలం 3మీటర్ల ఎత్తులోనే భారీగా నీటిని చెరువులకు తరలించేలా పెద్దపెద్ద తూములు నిర్మించారు.
దీంతో ఎస్సారెస్పీ నుంచి జిల్లా సరిహద్దు వరకు 16 చెరువులకు యాసంగిలో సైతం నీరందిచుకునే వీలు ఏర్పడింది. దీంతో వరద కాలువ కింద యాసంగిలో సైతం ప్రత్యక్షంగా 5వేల ఎకరాలు, మూడు కాలాలు నీరుంటుండడంతో వృద్ధి చెందిన భూగర్భ జలాల ప్రభావంతో బోరుబావులకు నీటి కొరత తీరి సుమారు 10వేల ఎకరాల్లో ఏటా రంది లేని యాసంగి సాగు జరుగుతున్నది. ప్రస్తుతం వరద కాలువ కింద యాసంగి వరి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. అక్కడక్కడా నాట్లు పూర్తయ్యాయి.