బోధన్, ఫిబ్రవరి 28:రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. ఏది చేసినా విమర్శలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం బోధన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఎన్ని గ్రామాల్లో తిరిగారు, ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు.
రాష్ర్టానికి ప్రపంచంలోనే పేరు తెచ్చిన మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో అర్వింద్ చేసిన పని తమకు తెలియదా. అని పేర్కొన్నారు. ఆయన తండ్రి పదవిలో ఉన్నప్పుడు టికెట్ల కేటాయింపులో వసూలు చేసిన విషయం గుర్తుందన్నారు. దొంగ సర్టిఫికేట్లతో పట్టాలు పొంది, పసుపు రైతులను బాండ్పేపర్ పేరుతో మోసం చేసి ఎంపీ గా గెలిచిన అర్వింద్కు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నిత్యం తన నామస్మరణతోనే అర్వింద్కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంశాలపై బోధన్లో బహిరంగ వేదికపై చర్చిద్దామని, తనపై ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరూ రావాలని సవాల్ విసిరారు. బోధన్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానిని సైతం రాజకీయం చేయడం శోచనీయమన్నారు. తాను ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ
బోధన్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం ప్రత్యేక నిధులు మంజూరైనట్లు తెలిపారు. బోధన్లో అర్హులైన 15వందల మందికి ఇండ్ల స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. నాలుగు వందల డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన వారికి త్వరలో అందజేస్తామని తెలిపారు. బోధన్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ రూ.10కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులు సరిపోవని నివేదించడంతో ప్రత్యేకంగా రూ. 25కోట్లు అందజేసేందుకు హామీ ఇచ్చారని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్ రావు దేశాయ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్, కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్, కౌన్సిలర్లు కొత్తపల్లి రాధాకృష్ణ, డేగావత్ దూప్సింగ్ నాయక్, బెంజర్ గంగారాం, పిట్ల సత్యనారాయణ, నాయకులు కేవీ సత్యం, తోకల గంగారెడ్డి, అశ్వాఖ్ అహ్మద్, పి.గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.