నందిపేట్, జనవరి 29 : మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో అఖిలాంధ్ర సాధూ పరిషత్ 57వ మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి సుప్రభాతం, భగవద్గీత పారాయణం, సాధువులతో ప్రత్యేక పూజ లు, హోమాలు, సాధుపరిషత్ అధ్యక్షుడు మాత పరావిద్యానందగిరి స్వామిచే పతాకావిష్కరణ, మంగిరాములు మహరాజ్ సభావేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవచనాలు, 8 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ధార్మిక ప్రవచనాలను వినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలిరావడంతో కేదారేశ్వర ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా అఖిలాంధ్ర సాధూ పరిషత్ అధ్యక్షుడు మాతా పరావిద్యానందగిరి స్వామి మాట్లాడుతూ.. సనాతనమైన హిందూ ధర్మాన్ని కాపాడడం, హిందూధార్మిక కార్యక్రమాలు చేపట్టడం, ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రజలకు దగ్గర చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా తాము తెలుసుకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచాలనే ఉద్దేశంతో ఒక పరిషత్గా ఏర్పడి మహా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో పురాతనమైన మన వేద విజ్ఞానం గొప్పదన్నారు. 2500 సంవత్సరాలు మనం బానిసలుగా ఉన్నందున సనాతన విజ్ఞానమంతా మరుగున పడిపోయిందన్నారు.
హిందూ సంప్రదాయంలో సైన్స్ దాగి ఉందని, హిందూ జీవన విధానం చాలా సూక్ష్మమైనదని తెలిపారు. అందరూ కలిసి హిందూ ధర్మాన్ని సంరక్షించుకునే ప్రయత్నమే సాధూ పరిషత్ మేళా అన్నారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారు హిందూ ధర్మరక్షకులవుతారని అలాంటి వారే దైవానికి దగ్గరవుతారని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన స్వామి రామ్ రాజేశ్వరచార్యజీ అన్నారు. సాయంత్రం హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామి హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు.