మెండోరా, జనవరి 29 : మండలంలోని ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతున్నదని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కాకతీయ కాలువకు అనుసంధానంగా జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదని పేర్కొన్నారు. రెండు టర్బయిన్లతో 13.22 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదని తెలిపారు. ప్రతిరోజూ 0.3221మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. జనవరిలో 11.5179 మిలియన్ యూనిట్లు ఉత్పత్తికాగా, ఈ సీజన్ మొత్తంలో 118.5156 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు వివరించారు.
యాసంగి పంటలకు కొనసాగుతున్న నీటి విడుదల
ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతున్నదని ఏఈఈ శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ కాలువకు 5,500, లక్ష్మీకి 200, ఎస్కేప్ గేట్లకు 150, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు 675 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 152 టీఎంసీల నీటి విడుదల కొనసాగుతున్నదన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1083.90 అడుగుల (63.469 టీఎంసీలు) వద్ద ఉన్నదని తెలిపారు.