ధర్పల్లి/ ఆరూర్, జనవరి 30 : జిల్లాలోని వివిధ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య శిబిరాలకు గ్రామాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ధర్పల్లి మండలంలోని ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగు, మోబిన్సాబ్ తండా, బెల్యాతండాతో పది ప్రాంతాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. శిబిరాలకు వస్తున్న వారికి వైద్యులు, సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలను అందజేశారు. శస్త్రచికిత్సలు అవసరమున్న వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సూపర్వైజర్ నిర్మల్, ఆఫ్తాల్మిక్ వైద్యులు హరినాథ్, సిబ్బంది అరుణ, స్వాతి, ఏఎన్ఎం నాగమణి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
ఆలూర్ మండలంలోని దేగాం, మచ్చర్లలో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నదని, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. శిబిరాన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు.
కోటగిరి జనవరి 30 : మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో, పొతంగల్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్వో విద్య సోమవారం పరిశీలించారు. రోజుకు 150 నుంచి 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఆమె వెంట హెల్త్ సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, సాయికుమారి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.