కామారెడ్డి,అక్టోబర్ 13 : ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూమ్లో నోడల్ అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి మాట్లాడుతూ.. ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం, డబ్బు, సరుకుల పంపిణీ, రవాణా జరిగినప్పుడు ప్రజలు సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారు వివరాలు గోప్యం గా ఉంచుతామన్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా రూ. 50 వేలకు మించి డబ్బును తరలిస్తే స్వాధీనపరుచుకుంటామన్నారు. రూ.10 లక్షలకు మించి డబ్బు కలిగి ఉంటే ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేస్తామన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, వారు ఎక్కడ ఫిర్యాదు అందినా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారని అన్నారు. పోలీసు,అబ్కారీ శాఖలు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. సువిధ యాప్ ద్వారా ముందస్తుగా అనుమతులు తీసుకొని సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, వీటంతటిని వీడియో తీస్తారన్నారు. ఎలాంటి ఒతిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పని చేయాలని, ఏ చిన్నతప్పు జరిగినా ఎవరినీ వదిలిపెట్టవద్దన్నారు.