నిజాంసాగర్, నవంబర్ 30: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్తో నాణ్యమైన విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పాఠశాలలే జవహర్ నవోదయ విద్యాలయాలు. ఉమ్మడి జిల్లాలో ఏకైక నవోదయ విద్యాలయం నిజాంసాగర్ మండల కేంద్రంలో ఉన్నది. ప్రశాంత వాతావరణంలో విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం, చక్కని డైనింగ్ గది, డిజిటల్ బోధనా సౌకర్యం ఉన్న తరగతి, వసతి గదులు ఉన్నాయి. వివిధ రకాల క్రీడల్లో తర్ఫీదు, సంగీతం ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులను చేస్తూ ముందుకు సాగుతున్నది.
అడ్మిషన్లకు అవకాశం..
2022-23 విద్యాసంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాల కోసం డిసెంబర్ 15తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.navodaya.gov.in/ www.jnvnizamabad. gov. in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోన్ చేసుకొని వివరాలు పొందుపర్చి విద్యార్థి లేదా సంరక్షకుడు సంతకం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు మే 1,2009 నుంచి ఏప్రిల్ 30, 2013 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75శాతం, పట్టణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం సీట్లలో 33శాతం బాలికలకు రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం 80సీట్లకు ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
1986లో స్థాపన..
రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాలు తొమ్మిది ఉండగా అందులో నిజాంసాగర్ నవోదయ ఒకటి. సుమారు 50ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో 1986లో ఏర్పాటు చేశారు. సీటు వచ్చిన విద్యార్థులకు 12వ తరగతి వర కు ఉచితంగా చదువుతోపాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 492 మంది విద్యార్థులు ఉన్నారు. సీబీఎస్ఈ సిలబస్లో బోధిస్తారు. 40 మంది విద్యార్థులకు ఒక గది. విశాలమైన ల్యాబ్లు, క్రీడా ప్రాంగణం ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సదుపాయలతో కార్పొరేట్ను తలదన్నేలా ఏర్పాటు చేశారు.
నవోదయ ప్రత్యేకతలు..
ఉదయం 5గంటలకు కాలకృత్యాల అనంతరం వ్యాయామం, ఆ తర్వాత విద్యార్థులకు బూస్ట్తోపాటు రోజుకో రకం టిఫిన్ పెడతారు. వారంలో మూడు సార్లు పండ్లు, మూడు సార్లు కోడిగుడ్డు, ఒకసారి మాంసాహారం అందిస్తారు. ఉదయం 7:20 నుంచి 1:30 వరకు పాఠశాలలో విద్యాబోధన. అనంతరం భోజన విరా మం. సాయంత్రం 3 నుంచి 4:30 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. 4:30కు టీ, స్నాక్స్, 5 నుంచి 6 గంటల వరకు క్రీడలు ఉంటాయి. జిమ్ క్లాసులు, ఇద్దరు పీఈటీలు వ్యాయా మం చేయిస్తారు. ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవసరమయ్యే మందులను సైతం అందజేస్తారు. సంవత్సరంలో రెండు జతల షూ, బెడ్షీట్స్, నెలకు సరిపడా సబ్బులు, కాస్మోటిక్స్ ఇస్తారు. విద్యార్థులకు కటింగ్ సైతం అందులోనే. నాణ్యమైన భోజనం అందించేందుకు ప్ర త్యేకంగా ఓ ఉపాధ్యాయుడు కూడా ఉంటారు. నవోదయలో ఇప్పటివరకు చదివిన విద్యార్థుల్లో ఎంతో మంది కలెక్టర్, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా, పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అంతేకాకుండా విదేశాల్లో సైతం ఎంతో మంది నవోదయ విద్యార్థులు ఉన్నత కొలువుల్లో ఉన్నారు.
ఈ నెల15తో ముగియనున్న గడువు
నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 ఆఖరు తేది. ముఖ్యంగా రూరల్, అర్బన్ కోటా విషయంలో జాగ్రత్తలు పాటించి దరఖాస్తు చేసుకోవాలి. నవోదయలో చదివిన వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారంటే ఉమ్మడి జిల్లాకే గర్వకారణం.