ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గింది. దీనికి తోడు అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రభుత్వం భర్తీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అడవిని, అడవుల్లోని జంతువులను కాపాడుకునేందుకు సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు. చెట్ల నరికివేత తగ్గడం, ఖాళీ ప్రాంతాల్లో హరితహారంలో భాగంగా మొక్కలను నాటడంతో గతంలో ఎడారిని తలపించిన అటవీ ప్రాంతాలు ప్రస్తుతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఫలితంగా మూగ జీవాలకు రక్షణ లభించినట్లయ్యింది. చిరుత పులుల సంతతి సైతం గణనీయంగా పెరిగినట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. వీటితో పాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య సైతం పెరిగింది.
నిజామాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దశాబ్ద కాలం క్రితం చూద్దామంటే కుందేలు కూడా కనిపించేది కాదు. ఇప్పుడేకంగా అడవుల్లో చిరుత పులుల సంచారం గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాక మునుపు అడవంటే వేటగాళ్లకు స్థావరం. లేదంటే కలప స్మగ్లింగ్కు కేంద్రం. కానిప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో అటవీ ప్రాంతం కంటికి రెప్పలా కాపాడబడుతున్నది. గతంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులకు గురైన అటవీ శాఖలో భారీ రిక్రూట్మెంట్ను ఇప్పటికే పూర్తి చేయడం ద్వారా సరిపడా సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అడవిని, అడవుల్లోని జంతువులను కాపాడుకునేందుకు సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఫలితంగా అడవి జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రధానంగా క్రూరమృగమైన చిరుత పులుల సంఖ్య గతం కన్నా మిన్నగా పెరిగినట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లోని అడవుల్లో పదుల సంఖ్యలో చిరుతలున్నట్లుగా చెబుతున్నారు. చెట్ల నరికివేత తగ్గడం, ఖాళీ ప్రాంతంలో హరితహారం చేపట్టడం ద్వారా అడవి పచ్చగా శోభిల్లుతున్నది.
రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంతు గణనను ప్రత్యేకంగా చేపట్టారు. ఆ సమయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొంత మంది ఔత్సాహిక అటవీ అధికారులు స్వీయ ఆసక్తితో జంతు గణనను చేపట్టారు. శాస్త్రీయ లెక్కలు చేపట్టనప్పటికీ పాద ముద్రల గుర్తింపు ద్వారా చిరుతల సంచారం పెరిగిందని నిర్ధారణకు వచ్చారు. అడవుల్లో కలియ తిరిగిన సంబంధిత సిబ్బంది పలు ఆసక్తికరమైన విషయాలను గమనించారు.
క్రూర మృగాలతో పాటుగా విభిన్నమైన పక్షిజాతులు సైతం అడవుల్లో దర్శనమిస్తున్నట్లుగా తేలింది. ముఖ్యంగా చిరుత పులుల సంఖ్య గతం కన్నా ఎక్కువయ్యిందని తేలింది. దాదాపు 55 చిరుత పులులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉమ్మ డి నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబార్, కొండ గొర్రెలు, దుప్పిలు, నీల్గాయి, తోడే ళ్లు, మనుబోతులు, అడవి కుక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు, అడవి పందులు వందల సంఖ్యలో ఉన్నా యి. క్షేత్ర పర్యటనల్లో వీటి జాడ అధికంగా తారస పడుతున్నట్లుగా అటవీ సంరక్షణ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 52,133 హెక్టార్లు, ఆర్మూర్లో 33,778 హెక్టార్లు, కామారెడ్డి 40,500హెక్టార్లు, బాన్సువాడ డివిజన్లో 40,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.
నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 27 : నాగిరెడ్డిపేట్ మండల శివారులోని రాముడి చెరువు సమీపంలో గల గుట్టపై మేతకు వెళ్లిన మేకల మందపై ఆదివారం సాయంత్రం చిరుత దాడి చేసింది. లింగంపేట మండలం లొంకల్పల్లి గ్రామానికి చెందిన బట్టు మల్లేశ్ రోజు మాదిరిగానే గుట్ట ప్రాంతానికి మేకలను మేపడానికి వెళ్లాడు. అటుగా వచ్చిన చిరుత మేకల మందపై దాడిచేసి ఒక మేకను గాయపరిచింది. మేకల కాపరి చాకచక్యంగా వ్యవహరించడంతో పులి గుట్ట వైపు పారిపోయినట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో పదుల సంఖ్యలో చిరుత సంచారానికి సంబంధించిన ఘటనలు వెలుగు చూశాయి.కామారెడ్డి జిల్లాలోని లింగంపేట, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో పశువులపై చిరుత దాడులు కలకలం రేపాయి. ఎల్లారెడ్డి, గాంధారి, రామారెడ్డిలోనూ చిరుతలు ఆయా గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల కంట పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలోనూ మాక్లూర్, చందూర్, భీమ్గల్, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో చిరుత సంచరించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. ఐదారేండ్ల క్రితం చిరుత సంచారానికి సంబంధించిన ఘటనలు మచ్చు కూ కనిపించకపోయేది.రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తుండడం, హరితహారంలో భాగంగా మొక్కలను పెంచడం, అడవిని సంరక్షించుకునేందుకు చర్యలు చేపట్టడం తో మూగ జీవాలకు రక్షణ లభించింది. అడవుల్లో క్రమం గా చిరుతల సంతానోత్పత్తి పెరగడం ద్వారా అప్పుడప్పుడు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పశువులపై దాడులకు పాల్పడుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో అడవుల్లో నిఘా పెరిగింది. అటవీ శాఖ నిరంతరం ప్రకృతి సిద్ధమైన సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్నది. తద్వారా వేటగాళ్ల అలజడి తగ్గుముఖం పట్టినప్పటికీ మరింత నిఘా అవసరమనే భావన ప్రజల్లో కలుగుతున్నది. పోచారం అభయారణ్యం పరిధిలో వేటగాళ్లు అడపాదడపా సంచరిస్తున్న ఆనవాళ్లను ఫారెస్ట్ వాచర్స్ గుర్తిస్తున్నారు. వాచర్స్ ద్వారా అటవీ అధికారులకు వేటగాళ్ల అలజడిపై సమాచారం చేరుతున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అడవి పంది, కుందేళ్ల వేట పేరిట జిం కలు, సాంబారు, దుప్పిలను లక్ష్యంగా చేసుకుని దుండగులు వేటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి వన్యప్రాణుల మాంసాన్ని హైదరాబాద్ వంటి ప్రాంతాలకు గుట్టుగా చేర్చి డబ్బులు దండుకుంటున్నారని తెలిసింది. అడవుల్లో కందకాలను తవ్వినప్పటికీ శాస్త్రీయ పద్ధతిలో వీటిని చేపట్టలేదు. మొక్కుబడిగా కందకాల తవ్వకాలు చేపట్టడం ద్వారా వేటగాళ్లు, కలప స్మగ్లర్లు సులువుగా అడవుల్లోకి వెళ్లి, వచ్చేందుకు వీలు పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
అడవి జంతువులను వేటాడడం చట్ట ప్రకారం నేరం. వేటగాళ్లపై గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. జంతువులను వేటాడే వారి గురించి తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి.
– సునీల్ ఎస్.హిరామత్, అటవీ శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా