ఏప్రిల్ 8: ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సమయంలో నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తన చాంబర్లో నామినేషన్ పత్రాలు అందించాల్సి ఉంటుందని, సెలవురోజు ఆదివారం మినహాయించి మిగతా అన్ని పనిదినాలను కలుపుకొని ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థి వెంట నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. నామినేషన్ సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో జమచేయాల్సి ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఎన్నికల లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులు గరిష్ఠంగా రూ.95లక్షల వరకు ఖర్చుచేయవచ్చని తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి,నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ పాల్గొన్నారు.