కంఠేశ్వర్, ఏప్రిల్ 18: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు రాపెల్లి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ రిటైర్డ్,కార్పొరేషన్ ఎంప్లాయీస్కు ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్ కోసమే తమ పోరాటమని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి భూక్యా నందు నామినేషన్ వేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఉచిత విద్య తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.