విద్యానగర్, జనవరి 11 : కంటి సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నారని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులకు కంటి వెలుగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలను అందజేస్తారని తెలిపారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 44 కంటి వెలుగు స్క్రీనింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 44 మంది వైద్యులు, 44 మంది అప్తాల్మిక్ టెక్నీషియన్లు,44 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు,అధికారుల భాగస్వామ్యంతో జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. శిబిరానికి ప్రతిరోజు 300 మంది హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా షెడ్యూల్ తయారు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జడ్పీ సీఈవో సాయగౌడ్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, రాజాగౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.