గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త వేషాలు వేస్తున్నది. పేదలకు ఉపాధి దూరం చేసేలా అనేక కొర్రీలు పెడుతున్నది. ఇప్పటివరకు గ్రామ సభల్లో సగటున 40-50 పనులను గుర్తించి పనులు కల్పించేవారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. పనుల సంఖ్యను 20కి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధి హామీ ద్వారా కూలీలకు కల్పించే పనుల సంఖ్య సగానికి సగం తగ్గిపోనున్నది. సాంకేతిక కారణాలను అడ్డుగా పెట్టుకుని ఎన్ఆర్ఈజీఎస్కు నిధులు నిలిపేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. నాలుగు నెలలు వ్యవసాయ పనుల్లో బీజీగా ఉండే కూలీలు మిగిలిన కాలంలో ‘ఉపాధి’పైనే ఆధారపడుతున్నారు. మూడేండ్లుగా వంద శాతం పేదలకు ఉపాధి కల్పించడం, పారదర్శకంగా పనులు చేపట్టడంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. కేంద్రం అనాలోచిత చర్యలతో గ్రామీణ జీవన వ్యవస్థ దుర్భరంగా మారనున్నది.
నిజామాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇకపై గ్యారంటీ అనే పదానికి అర్థం లేకుం డా చేయబోతున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం. ఏడాదికి ప్రతి పేద కుటుంబానికి 100 రోజుల పని దినాలతో ఉపాధి కల్పించడం కోసం తీసుకు వచ్చిన పథకాన్ని రాష్ట్రంలో నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకు కొత్తగా తీసుకు వస్తున్న నిబంధనలతో పేదల నోటికాడి బుక్కను ప్రధాని మోదీ దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తున్నాడు. మానవీయ పథకంగా పేరుగాంచిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కారు దొంగ దెబ్బ తీస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాదిలో సుమారు 4 నెలల పాటు ఆయా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే కూలీలు మిగిలిన కాలంలో ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారు. గ్రామ సభల్లో నిర్ణయించిన పనుల్లో భాగస్వామ్యమై శ్రమటోడ్చినందుకు ఇచ్చే ప్రతిఫలంతో ఆనందంగా జీవించే వారందరికీ కేంద్ర సర్కారు మూలంగా ఇబ్బందులు తప్పేలా లేదు.
కేంద్రం కొర్రీలు…
సాఫీగా అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో బ్రేక్ వేసేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. పరిశీలన పేరుతో నానా హంగామా చేసిన కేంద్ర బృందాలు తప్పుడు నివేదికలను సమర్పించడంతో వీటినే ఆసరాగా చేసుకుని కొర్రీలు పెట్టేందుకు మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో, కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో సగటున 40-50 పనులను గుర్తిం చి వీటిని నిబంధనల మేరకు గ్రామ సభల ద్వారా ఆమోదం తెలుపుతున్నారు. ప్రస్తుతం గ్రామానికి కేవలం 20 పనులనే కేటాయిస్తున్నట్లుగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధి హామీ ద్వారా కూలీలకు కల్పించే పనుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనున్నది. సాంకేతిక కారణాలను అడ్డుగా పెట్టుకుని ఎన్ఆర్ఈజీఎస్కు నిధులు నిలిపేసేందు కు సిద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిశీల విధానాలతో దీర్ఘకాలికంగా ప్రజలకు లాభం జరిగేలా ఉపాధి నిధులతో గ్రామాల్లో డంపింగ్ యా ర్డు, వైకుంఠధామం, రైతు వేదికలు, రైతు కల్లాలను నిర్మించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సైతం వా టాగా నిధులను మంజూరు చేస్తుండగా కేంద్రం మాత్రం అడ్డు పుల్లలు వేస్తూ నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నది. 2020 నుంచి కక్షపూరితంగా తనిఖీలు చేపడుతూ తప్పులు లేకపో యినా లోపాలను భూ తద్దంతో వెతికి మరీ రాష్ట్ర సర్కారుపై బురదజల్లే యత్నానికి ఒడిగడుతున్నది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు చెల్లించే వేతనాలు 60శాతం కాగా మిగిలిన 40శాతం మెటీరియల్ పేమెంట్గా పరిగణిస్తారు. 60శాతం వేతనాలు కేంద్రం, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుం ది. 40శాతం మెటీరియల్ కంపోనెంట్ మొత్తంలో 75శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన 25శాతం మెటీరియల్ కంపోనెంట్ పైకం రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిస్తుంది. పథకం నిర్వహణ 6శాతం ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
వలసలు పెరిగే అవకాశం…
కేంద్రంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల తీరుతో గ్రామీణ జీవన వ్యవస్థ అతలాకుతలం అవుతున్న ది. దశాబ్ద కాలంగా గ్రామాల నుంచి జనమంతా పట్టణాలకు పరుగులు తీసి ఉపాధి పొందుతున్నా రు. ఇలాంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ మూలంగా ఉపాధి హామీ పథకం బలంగా అమలు చేయడంతో గ్రామాల్లో జనమంతా సంతోషంగా జీ విస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుతో ఇకపై నిత్యం పని కల్పించే అవకాశం ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ ఇకపై వెలవెలబోయే దుస్థితికి చేరే అవకాశం ఏర్పడుతున్నది. తద్వారా బతుకు జీవుడా అనుకుంటూ నగరాలు, పట్టణాలకు ఇతర కూలీ పనుల కోసం వలసలు వెళ్లే ఆస్కారం లేకపోలేదు. ఉపాధి హామీ పని చేసే వారికి రోజుకు రూ.245 అందుతున్నది. పట్టణాల్లో కూలీ పనులకు రోజం తా కష్టపడినప్పటికీ రూ.150 కూడా వస్తుందో రాదో అన్న చింత వెంటాడుతున్నది. ఉపాధి హామీ పథకంలో ఇష్టంగా పని చేస్తూ, వ్యవసాయ కూలీ పనులతో సంతోషంగా గడుపుతున్న వారంతా ఇకపై ఇతర మార్గాలను వెతుక్కుంటూ వలస వెళ్లడమే కనిపిస్తోంది. ఇంతటి విపత్కర స్థితికి కారణమైన కేంద్రంలోని బీజేపీ తీరుపై పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కష్టంలో తోడూ నీడా…
ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలో కామారెడ్డి జిల్లా మూడేండ్లుగా ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు లాక్డౌన్ విధించింది. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్లిన వారు తిరిగి పల్లెబాట పట్టారు. అలాంటి వారికి ఏడాదిగా ఉపాధి పనులే ఆసరా అయ్యాయి. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండడంతో కూలీలు వలసలు మానుకున్నారు. ఈ పథకం పనులకే ఎక్కువగా హాజరవుతూ కు టుంబాలను పోషించుకుంటున్నారు. కూలీలకు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అమలులో కామారెడ్డితో పాటుగా నిజామాబాద్ జిల్లా సైతం టాప్ 10లోనే నిలిచింది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణతో పనితీరులో టాప్లో నిలవడం విశేషం. రాష్ట్ర వ్యా ప్తంగా వంద రోజు లు పని దినాలు పూర్తి చేసిన కు టుంబాల్లోనూ కామారెడ్డి ముందంజలో ఉండగా, గుర్తించిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడంలో నిజామాబాద్కు గుర్తింపు దక్కింది. కూలీలకు పని కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ, డబ్బులు వారి ఖాతా ల్లో జమ చేసే విధంగా యంత్రాంగం చర్యలు తీసుకోవడం ద్వారా ఎంతో ఉపయుక్తంగా ఉంది.
మెటీరియల్ కాంపోనెంట్ నిధులకు పడనున్న బ్రేక్
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. గతంలో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరయ్యేవి. వీటితో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉండేది. కానీ కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా కాంపోనెంట్ నిధులకు ఇక బ్రేక్ పడుతుంది.
– మెట్టు అశోక్, సర్పంచ్, కొండూర్
పకడ్బందీగా ఉపాధి పనుల కల్పన…
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 100 రోజులు పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యధిక పని దినాలు కల్పించడం, పారదర్శకంగా కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయి. కరోనా సమయంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి జిల్లాను ముందంజలో నిలిపాం. అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు అందివ్వడంతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వసతుల కల్పనను చేపట్టాం. గ్రామ సభ ద్వారానే పనుల గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నది.
– సాయన్న, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా
ఉపాధి కూలీలను ఇబ్బంది పెట్టడం సరికాదు
బీబీపేట్ : కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఉపాధి హామీ కూలీలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉపాధి హామీ పనుల్లో పాత పద్ధతినే అమలు చేయాలి. గ్రామాల్లో పనులను 40 నుంచి 20కి కుదించడంతో కూలీలకు ఉపాధి లభించే పరిస్థితి ఉండదు. ఇకనైనా కేంద్రం తీరు మార్చుకోవాలి.
– అల్వాల రేవతి, సర్పంచ్, మాందాపూర్
ఉపాధి కోల్పోతున్న కూలీలు
లింగంపేట : ఉపాధి హామీ పథకంపై కేంద్ర పెడుతున్న నిబంధనల కారణంగా కూలీలు ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. గతంలో గ్రామాల్లో గుర్తించిన పనులు చేయించే వాళ్లం. కూలీలకు వంద రోజుల పాటు పనులు లభించేవి. కక్షసాధింపు నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం కూలీల పోట్ట కొడుతున్నది. కూలీలకు పనులు కరువయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది.
– బండి రాజయ్య, సర్పంచ్, లింగంపల్లి.