నిజామాబాద్సిటీ, డిసెంబర్16 : రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు రైతులు ఇతర పంటలవైపు వెళ్లడం సంతోషంగా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాపరిషత్ సమావేశమందిరంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయం, అటవీశాఖ, విద్యుత్, డీఆర్డీఏ, వైద్యశాఖ, ఆర్టీసీ, సివిల్సప్లయీస్, ఆర్డబ్ల్యూసీ, నీటిపారుదల శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సీఎం కేసీఆర్తో కలిసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో ధర్నా చేపట్టిన తరువాతిరోజు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మన జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. కరోనా బారినపడి రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని అన్నారు. ఈ మేరకు వైద్యశాఖ సూచనలు జారీ చేసిందన్నారు.
ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి వ్యాక్సిన్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించి జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని కోరారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అందిస్తున్న 57 రకాల ఉచిత పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ అధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని, చాలాసార్లు సమావేశంలో సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామానికి ఏ అధికారి వెళ్లినా, ఆ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన బుక్లో సంతకం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. అన్ని భూములను సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నదని తెలిపారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ధరణిలో 90శాతానికిపైగా భూములకు క్లియరెన్స్ ఇచ్చామన్నారు. 33,456 ఎకరాల పోడుభూముల హక్కుల కోసం దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అనారోగ్యంతో మృతిచెందిన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బాలనరేంద్రకు సర్వసభ్య సమావేశం ప్రారంభానికి ముందు సభ్యులు నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.