ఇందల్వాయి, నవంబర్ 30: వరి సాగు చేస్తున్న రైతులు వరుస నష్టాలతో అప్పులపాలవుతున్నారు. ఏటా దిగుబడులు తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగులో సాంకేతికత లేకపోవడం, రైతుల్లో అవగాహన లోపం, చీడపీడల ఉధృతి.. దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలుగా వ్యవసాయ అధికారులు విశ్లేషిస్తున్నారు. నాణ్యమైన దొడ్డు రకం వరి వంగడాల సాగుతో ఎకరానికి గరిష్ఠంగా 32 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. కానీ మూడు సీజన్ల నుంచి కనిష్ఠంగా 20క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. 2020 యాసంగిలో చీడపురుగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు కష్టాలపాలయ్యారు. ప్రస్తుత సీజన్లో సైతం విస్తృతంగా వర్షాలు కురిసి పంటలు నీటమునిగి దిగుబడి తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఎకరం భూమిలో వరి పండించడానికి రైతులకు రూ.30వేల పైనే పెట్టుబడి అవుతున్నది. ఎకరానికి సగటు 25క్వింటాళ్ల దిగుబడి వచ్చినా పెట్టుబడులు పోను రైతుకు మిగిలేది రూ.18వేలు మాత్రమే.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
ఏండ్ల తరబడి పంట మార్పిడి చేయకపోవడంతో భూసారం తగ్గి దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. దీంతో భూసారం పెరిగి దిగుబడులు పెరగడమే కాకుండా నీరు, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది.