ఎల్లారెడ్డి, ఏప్రిల్ 21 : పల్లెలు అభివృద్ధి చెందాలంటే చెరువులు నిండాలి…అలుగులు పారాలి… రైతులు మురువాలి అనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ మన జిల్లాలోని సదాశివ నగర్ పాత చెరువులో ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం దేశంలోనే అందరి మన్ననలు అందుకున్నది. తెలంగాణలో కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో తవ్వించిన వందలాది చెరువులు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రూపుదిద్దుకున్న మిషన్ కాకతీయ పథకం మన జిల్లాలో ప్రారంభం కావడం మన ప్రాంతానికి గర్వ కారణంగా నిలిచింది.ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పలువురు వ్యాపార వేత్తలు మిషన్ కాకతీయ పథకానికి కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించడం ఈ పథకానికి వన్నె తెచ్చింది.
ముఖ్యమంత్రి తట్టెడు మట్టి మోసింది పాత చెరువులోనే..
మిషన్ కాకతీయ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశివ నగర్ పాత చెరవులో మొదటి సారి గడ్డపార చేత పట్టి చెరువులోని పూడిక మట్టిని తవ్వారు. అనంతరం తవ్విన మట్టి తట్టను మోసుకెళ్లి ట్రాక్టర్లో వేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
2015లో ప్రారంభమైన మిషన్ కాకతీయ పథకం…
రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ పథకం 2015 మార్చి 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి సుమారు ఏడు సంవత్సరాలు పూర్తయింది. మూడు విడుతలుగా చెరువులకు నిధు లు మంజూరు చేయడంతో ప్రస్తుత కామారెడ్డిలోని సుమారు రెండు వందలకు పైగా చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. జిల్లాలో ఉన్న చెరువులకు మంజూరైన నిధులతో పనులు పూర్తి స్థాయి లో చేయడంతో ప్రతి గ్రామంలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నాలుగు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురువడంతో చెరువులు నిండి అలుగులు పారడంతో రైతులు ఆనందంతో పంటలు సాగు చేస్తున్నారు.
సీఎం హామీతోనే కామారెడ్డి జిల్లా ఏర్పాటు..
ప్రస్తుతం ఏర్పాటైన కామారెడ్డి జిల్లాకు మిషన్ కాకతీయ పథకం ప్రారంభోత్సవ వేదికనే పునాది. ఆ రోజున జరిగిన సమావేశంలోనే కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చింది, కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. గంప గోవర్ధన్ కోరిక మేరకు కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించి హామీలు అమలు చేశారు.