బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించడానికే సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల మండలంలోని బోర్లం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను స్పీకర్ పోచారం సందర్శించగా, తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి గమనించారు. విద్యార్థులకు కావాల్సిన ఫ్యాన్లు సొంతఖర్చుతో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం పాఠశాలకు వచ్చి 50 ఫ్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుతూ పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే స్పీకర్ సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల యోగాక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్లు అందజేసిన డీసీసీబీ చైర్మన్కు పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రిన్సిపాల్ శ్రీలత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్రెడ్డి, కమటాల శ్రీనివాస్రెడ్డి, బాబా, రాజేశ్వర్ గౌడ్, గోపన్పల్లి సాయిలు, మంద శ్రీనివాస్, నాగభూషణం, జీవన్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు.
దివ్యాంగుడికి చేయూత
వర్ని మండలానికి చెందిన ఓ దివ్యాంగుడికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి చేయూతనిచ్చారు. తన సొంత డబ్బులతో ద్విచక్రవాహనాన్ని అందించారు. కొన్ని రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ వర్ని మండలంలో పర్యటించగా, తగ్గెల్లి గ్రామానికి చెందిన ముజ్జు అనే దివ్యాంగుడు తన ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిని గుర్తుంచుకున్న డీసీసీబీ చైర్మన్ తన సొంత డబ్బులు రూ.లక్షా 20వేలతో స్కూటీని కొనుగోలు చేసి గురువారం బాన్సువాడలోని స్పీకర్ నివాసం వద్ద దివ్యాంగుడికి అందజేసి సేవాగుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుడు ముజ్జు మాట్లాడుతూ.. తన ఆనందానికి అవధుల్లేవన్నారు. స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.