కమ్మర్పల్లి, ఏప్రిల్ 11 : గ్రామాల్లోని వారాంతపు సంతల్లో ఎండు మిర్చి విక్రయాల సందడి జోరందుకుంది. జగిత్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల వ్యాపారులు, రైతులు ఎండు మిర్చిని ఏటా ఈ సమయంలో ఇటు నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంత గ్రామాలకు తెచ్చి విక్రయిస్తారు. ఎప్పటి లాగే ఈసారి కమ్మర్పల్లి వారాంతపు సంతలో గత నెలలో చివరి శనివారం మిర్చి విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే ఎప్పుడూ లేని విధంగా కిలో ఎండు మిర్చి ధర రూ.260 ఉంది. అటు తర్వాత ఈ నెల 2వ తేదీన వచ్చిన శనివారం నాడు ఉగాది పండుగ కావడంతో మార్కెట్లో విక్రయాల సందడి కనిపించలేదు. దీంతో తాజాగా శనివారం జరిగిన సంతలో కిలో మిర్చి ధర రూ. 220 నుం చి రూ.260 వరకు పలికింది. గత ఏడాది రూ.180తో ప్రారంభమై తగ్గుముఖం పట్టిన ధర ఈ సారి మాత్రం రూ. 260 వరకు ఉండడంతో కొనుగోలుదారులకు ఎండు మిర్చి ధర ఘాటు తగులుతున్నది. ఈసారి మిర్చి జగిత్యాల జిల్లా సరిహద్దు ప్రాంత మండలాలైన కథలాపూర్, రుద్రంగి తదితర మండలాల్లో దిగుబడి కాస్త తగ్గడం.. ఇదే సమయంలో మార్కెట్ యార్డుల్లో మంచి ధర రావడంతో మిర్చి ఆ మార్కెట్లకే తరలిందని.. దీంతో మిర్చి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తరహాలో జిల్లా సరిహద్దుల రెండు వైపులా మిర్చి పౌడర్ చేసే వ్యాపారాలు వెలియడంతో ఎండు మిర్చి మార్కెట్ పెరిగినట్లయ్యింది. ఇది రానున్న రోజుల్లో ధరల తగ్గుదలకు కారణం కాగలదనే అంచనాలు ఉన్నాయి.