కొడంగల్/ఇబ్రహీంపట్నం/ములుగు/మిర్యాలగూడ టౌన్/దోమ, మార్చి 15: ఉద్యోగనామ సంవత్సరం మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడంతో నిరుద్యోగులు పుస్తకాలపై దృష్టి పెట్టారు. పెద్ద మొత్తంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కుస్తీపడుతున్నారు. స్థానికులకే 95శాతం కల్పించడంతో పాటు అన్ని శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఉండగా.. తప్పకుండా ఉద్యోగం వస్తుందనే ధీమాతో నిరుద్యోగులు ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో కొందరు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించగా.. మరికొందరు గ్రంథాలయాలనే శిక్షణ కేంద్రంగా మార్చుకున్నారు. శ్రమిస్తే సర్కారి కొలువు సాధించడం సులభమేనని గతంలో ఉద్యోగాలు పొందిన వారు తెలుపుతున్నారు. వారి అనుభవ పాఠాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
శిక్షణ పొందా.. ప్రిపేర్ అయ్యా.. 3వ ర్యాంకు సాధించా
మాది వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని ఎరన్పల్లి గ్రామం. కొడంగల్ పట్టణ కేంద్రంలోని విశ్వభారతి హైస్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నా. ఆపై చదువులకు గాను హైదరాబాద్కు చేరుకొని ఇంటర్, బీ టెక్ పూర్తి చేశా. 2014లో బీటెక్ పూర్తి అనంతరం ఒక సంవత్సరం వ్యవసాయ పనుల్లో మా తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచాను. 2016లో ఎస్ఐ ఉద్యోగానికి కోచింగ్ తీసుకున్నా. కరెంటు ఎఫైర్స్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి వంటి ఎన్నో పుస్తకాలను చదివాను. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించా. 2018 పోలీసు రిక్రూట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగం సాధించి ప్రస్తుతం నల్గొండలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ శాఖలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నా.
– నితిన్సింగ్, స్పెషల్ పోలీస్ శాఖలో ఎస్సై
గ్రంథాలయంలోనే ప్రిపేరయిన
‘మాది ములుగు జిల్లా దేవగిరిపట్నం. హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సై కొలువుకు దరఖాస్తు చేసుకున్నా. కోచింగ్ సెంటర్లను ఆశ్రయించకుండా జేఎన్టీయూ కూకట్పల్లి గ్రంథాలయంలోని పుస్తకాలు చదివాను. రూపాయి ఖర్చు లేకుండా అక్కడి పుస్తకాలు నా భవిష్యత్తుకు దారిచూపాయి. మొదటి పోటీ పరీక్షలో సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన పరీక్ష రాశాను. ఇన్కమ్టాక్స్ ఆఫీసర్గా ఎంపికయ్యా. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కొలువు ఇస్తుందోనని వెళ్లలేదు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా కేవలం ఈ గ్రంథాలయం ద్వారానే సన్నద్ధమై పోస్టుకు ఎంపికయ్యాను. పోలీస్ శిక్షణ కాలంలో గ్రేహౌండ్స్ విభాగంలో ఇండోర్ గేమ్స్లో టాపర్గా నిలిచాను. అలాగే నేర పరిశోధన విభాగంలో పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో పతకం సాధించాను. ప్రొబేషనరీ పీరియడ్లో నెల రోజుల పాటు ములుగు జిల్లా మంగపేట పోలీస్స్టేషన్లో పనిచేసి హన్మకొండ, మిల్స్కాలనీ, కేయూ పోలీస్స్టేషన్ల్లో ట్రెయినింగ్ పొంది ప్రస్తుతం జనగామ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నా.
– భోగం ప్రవీణ్, ఎస్సై, జనగామ
గ్రూప్ -2 సాధించిన..ఇప్పుడు గ్రూప్-1కు ప్రిపేరవుతున్న
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని రామ్నగర్ బంధం గ్రామం. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగాను. ప్రతిరోజూ జిల్లా లైబ్రరీకి బాక్స్ కట్టుకుని ఉదయం 8గంటలకు వెళ్లి రాత్రి 7 వరకు చదువుకునే వాడిని. ఆరు నెలలు కష్టపడిన తర్వాత 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. తుంగతుర్తిలో కొద్దికాలం కానిస్టేబుల్గా పనిచేసిన. 2016లో ఆర్ఎస్ఐగా ఉద్యోగం రావడంతో పాల్వంచకు వెళ్లాను. అదే సమయంలో స్వరాష్ట్రంలో మా బతుకులు మారుతాయనే ఉద్దేశంతో ఉన్నత ఉద్యోగం పొందాలని సెలవు పెట్టి తిరిగి నల్లగొండకు వచ్చాను. నల్లగొండలో ఉన్న లైబ్రరీలో దొరికే అమూల్యమైన పుస్తకాలను నిరంతరం చదువుతూ, నోట్స్ రాసుకుంటూ రెండేండ్లు కష్టపడ్డాను. ఫలితంగా 2018లో గ్రూప్-2లో విజయం సాధించి ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికయ్యాను. ప్రస్తుతం నాగర్కర్నూల్లో పనిచేస్తున్నా. ఇప్పటికీ పుస్తకాలు చదువుతున్నా. గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా.
– చల్లా రవి, ఎక్సైజ్ ఎస్ఐ, నాగర్కర్నూలు
సిలబస్ను పూర్తిగా అధ్యయనం చేయాలి
మాది దోమ మండలంలోని మల్లేపల్లి గ్రామం. మా నాన్న ఆర్మీ ఉద్యోగి. కష్టపడి చదివాను. 2020 బ్యాచ్లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యాను. నేను ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారికి చెప్పేది ఒక్కటే. ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే మొదటగా ఆ ఎగ్జామ్కు సంబంధించిన సిలబస్ను పూర్తిగా అధ్యయనం చేయాలి. దానికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కు మార్కెట్లో లభించే రెండు రకాల సిరీస్ల నుంచి బుక్స్ తీసుకొని వీలైనన్ని సార్లు రివిజన్ చేయాలి. వీలైనన్ని మాక్ టెస్టులు అటెండ్ కావాలి. పాత ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయాలి. ప్రతి రోజు మంచి ప్రమాణాలు కలిగిన రెండు రకాల న్యూస్ పేపర్లు చదివి ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకొని రివిజన్ చేయాలి. ఇలా చేస్తే పోటీ పరీక్షలో విజయం సాధించడం సులువు.
– నిమ్మలి శ్రీనివాస్యాదవ్, ఎక్సైజ్ ఎస్సై, పటాన్చెరు
సొంత జిల్లాలో పనిచేయడం నా అదృష్టం
మాది రంగారెడ్డిజిల్లా, మహేశ్వరం మండలం, మొహబ్బత్నగర్ గ్రామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోనల్ విధానంలో మార్పులు వచ్చాయి. మొట్టమొదటిసారిగా 2016లో ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2017లో ఎస్సైగా ఎంపికయ్యాను. 2018లో ట్రైనింగ్ పూర్తిచేసుకుని ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాను. సొంత జిల్లాలోనే ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. మొదటగా హైదరాబాద్ కమిషనరేట్లో, తర్వాత రాచకొండ కమిషనరేట్లో పనిచేశాను. రాచకొండలో తన సొంత జిల్లాలోని మాడ్గుల పోలీసుస్టేషన్లో కొన్నిరోజులు విధులు నిర్వహించాను. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న. ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే సాధ్యమైంది.
– అరుణ్కుమార్, ఎస్సై, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.