విద్యానగర్, మార్చి 15 : ధరణి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపునకు పలుకుతున్నాయని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూర్ శివారులోని ధరణి టౌన్షిప్లో ప్లాట్లకు స్థానిక ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజానికి రూ. ఏడువేలు ఉందని తెలిపారు. వేలం ద్వారా కొన్ని ప్లాట్లు చదరపు గజానికి 15,800 రూపాయల చొప్పున దక్కించుకున్నారని చెప్పారు.దీంతో ప్లాట్ల ధరలు రెండింతలు పలికినట్లు తెలిపారు. 44వ జాతీయ రహదారి పక్కన, రామారెడ్డి రోడ్డు సమీపంలో ధరణి టౌన్షిప్ ఉందన్నారు. సమీపంలోనే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం ఉన్నందున డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగులు,ప్రజలు వేలంలో పాల్గొని తమకు నచ్చిన ధరకు పాడి ప్లాట్లను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. మంగళవారం 70 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించామని చెప్పారు. ప్లాట్ల వేలం ద్వారా మొత్తం 26 కోట్ల 85 లక్షల 63 వేల252 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి మంచి స్పందన లభిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్,ఆర్డీవో శ్రీను, కలెక్టర్ ఏవో రవీందర్, తహసీల్దార్ ప్రేమ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు