నిజామాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారిని సంపూర్ణంగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా దశల వారీగా ఆయా వయసుల వారికి టీకాల పంపిణీ కొనసాగుతుండగా, కొత్తగా నేటి నుంచి 12, 13, 14 ఏండ్ల బాల, బాలికలకు టీకాలు ఇవ్వనున్నది. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి అన్నది కనిపించడం లేదు. గడిచిన వారం రోజుల్లో ఒకటే పాజిటివ్ కేసు నమోదైంది. అడపాదడపా వస్తున్న కేసులే తప్ప భారీగా వ్యాప్తి చెందుతున్న దాఖలాలు లేవు. ఇందుకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో కొనసాగించడమే కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తిగా సఫలమైంది. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ వ్యాక్సిన్ అందించారు. మొదటి, రెండు డోసులు తీసుకున్న తర్వాత నిర్ణీత కాల వ్యవధి పూర్తయితే 60 ఏండ్లు నిండిన వారికి ప్రికాషన్ డోసును సైతం పంపిణీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 22లక్షల 38వేల డోసుల టీకాల పంపిణీ పూర్తయ్యింది.
12-14 ఏండ్ల బాలలకు టీకాలు…
వైరస్ ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. మొదట వివిధ రోగాలతో బాధ పడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. తదనంతరం వయో వృద్ధులు, ఆ తర్వాత వయసు ఎక్కువ ఉన్న వారికి ఇలా దశల వారీగా టీకాలు అందించారు. డీజీసీఏ అనుమతితో వ్యాక్సిన్ను మైనర్లకు సైతం పంపిణీ ప్రక్రియ ఆరు నెలల క్రితం మొదలైంది. 15నుంచి 17 ఏండ్ల వయసు వారికి టీకాలను అందించారు. తాజాగా 12-14 ఏండ్ల వయసు వారికి టీకాలు ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను వైద్యారోగ్య శాఖ ప్రారంభించనున్నది. టీనేజర్లకు(15-17 వయసు) ఇప్పటి వరకు 94వేల 180 మందికి టీకాలు పంపిణీ చేశారు. మరికొద్ది మందికి టీకాలు ఇవ్వడంతో వంద శాతం చేరుకుంటామని సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 12, 13, 14 ఏండ్ల బాల, బాలికలు సుమారుగా 30వేల నుంచి 50వేల వరకు ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీరందరికీ టీకాలను పకడ్బందీగా ఇచ్చేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
కరోనా వైరస్ చొచ్చుకొచ్చి దాదాపుగా రెండేండ్లు దాటింది. ఈ మధ్య కాలంలో ప్రపంచం గతంలో కనీవినీ ఎరుగని విపత్కర సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా మొదటి, రెండో వేవ్లలో మానవ సమాజం తీవ్రంగా ఇబ్బంది పడింది. వైరస్ అంటుకుని తేరుకునే లోపే విలువైన ప్రాణాలు గాల్లో కలిసిన పోయిన దాఖలాలు అనేకం వెలుగు చూశాయి. మూడో వేవ్ వ్యాప్తి వేగంగా జరిగినప్పటికీ రెండు వేవ్లలో జరిగినంత ప్రాణ నష్టం సంభవించలేదు. మూడో వేవ్లో స్వల్ప లక్షణాలతో మెజార్టీ వర్గానికి వైరస్ సోకినప్పటికీ ఇంట్లో ఉండి కూడా చికిత్స తీసుకుని బయట పడ్డారు. దవాఖాన మెట్లెక్కి ఇబ్బందులు పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. భవిష్యత్తులో నాలుగో వేవ్ లాంటివి రాకపోవచ్చని కొన్ని పరిశోధనా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ వైరస్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం మరో వేవ్ చూడక తప్పదంటూ పలు పరిశోధనలు ఇప్పటికే వెల్లడయ్యాయి. రకరకాల పరిశోధన పత్రాలు బహిర్గతం అవుతున్న వేళ ముందస్తు వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తూచా తప్పకుండా పాటిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతో వ్యాక్సినేషన్ను వేగవంతంగా నిర్వహిస్తోంది. టీకాల పంపిణీ కార్యక్రమం సమాంతరంగా జరుగుతోంది.
22.38లక్షల డోసుల పంపిణీ…
సమాజం కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించి పోలేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సంపూర్ణ కట్టడే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. టీకాలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకు నిజామాబాద్ జిల్లాలో 22లక్షల 38 వేల 386 డోసుల కొవిడ్ టీకాల పంపిణీ జరిగింది. ఇందులో మొదటి డోసు 12లక్షల 404, రెండో డోసు 10లక్షల 23వేల 75 డోసులు అందించారు. ప్రికాషన్ డోసులు 31,536 అందించారు. ఈ ఏడాది మూడో వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా తీవ్రత మాత్రం చాలా తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కుదురుకుంటున్నారు. మరోవైపు వైరస్ కట్టడే లక్ష్యంగా గతేడాది నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. దేశంలో అనుమతి పొందిన నాలుగైదు టీకాల్లో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు టీకాలనే అత్యధిక మంది స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెండు టీకాలకే ప్రాధాన్యం ఇస్తున్నది. మొదట్లో టీకా కోసం చాలా మంది ముందుకు రాలేదు. ప్రస్తుతం అవగాహన తెచ్చుకుని టీకా ఇప్పించుకునేందుకు తరలి వస్తున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు…
ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వయసున్న వారికి కొవిడ్ టీకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బుధవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం టీనేజర్లకు అందిస్తున్న విధంగానే 12, 13, 14 ఏండ్ల వయసున్న బాలలకు వ్యాక్సిన్ అందిస్తాం.
– సుదర్శనం, డీఎంహెచ్వో, నిజామాబాద్ జిల్లా