ఖలీల్వాడి, డిసెంబర్ 16: నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజక వర్గ్గాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత చొరవతో నిధులు మంజూరయ్యాయి. నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం సీడీపీ నిధులు విడుదల చేసింది. బోధన్ మండలంలోని మినార్పల్లి గ్రామంలో రూ. 50లక్షలతో కమ్యూనిటీహాలు, నవీపేట్ మండలం పోతంగల్లో రూ. 50లక్షలతో పాఠశాల భవనం, కమ్యూనిటీ హాలు కోసం నిధులు విడుదల చేయించారు. బోధన్ పట్టణంలోని 37వ వార్డులో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిజామబాద్ అర్బన్లోని 42వ డివిజన్లో కమ్యూనిటీ హాలు ప్రహరీ నిర్మాణానికి రూ. 10 లక్షలు, 6, 15, 16, 25, 50 డివిజన్లలో ఒక్కో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ. 5లక్షల నిధులు విడుదల చేశారు. దీంతోపాటు బాల్కొండ మండలంలో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 25లక్షలు, మోర్తాడ్ మండలం తిమ్మపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5లక్షలు, ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో కమ్యూనిటీ హల్ నిర్మాణానికి రూ. 30లక్షల నిధులు విడుదలయ్యాయి. వివిధ మండలాలలకు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.