ఖలీల్వాడి, జూన్ 27: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా పసుపు బోర్డు తీసుకువచ్చేందుకు పోరాడితే అండగా ఉంటామని ఎంపీ అర్వింద్కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణంపై ఎంపీ అర్వింద్ బహిరంగ ప్రకటన విడుదల చేశారని, అందులో అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు కలిసి రావాలని కోరారన్నారు. అర్వింద్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే జిమ్మిక్కులు చేస్తున్నారని చెప్పారు. ఆర్వోబీ కోసం రూ.94 కోట్లు వ్యయం తో అంచనా వేయగా.. అందులో ట్రాక్ కోసం కేవలం రూ.30 కోట్లు సాంక్షన్ తెచ్చి రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. మిగిలిన రూ.64 కోట్లు లింకు రోడ్లు, స్థలం కోసం కేటాయించారని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని రైల్వే డిపార్ట్మెంట్ షరతులు పెట్టిందని తెలిపారు.
ఇది నవంబర్లో జరిగిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో జిల్లా ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే రూ.94 కోట్లు సాంక్షన్ చేయించాలని, కేవలం రూ.30 కోట్లు తీసుకొచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.
ఎంపీగా గెలిచిన నాటి నుంచి రెండేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఆదాయం సరిగా లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.64కోట్లు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తూ నిరసన తెలియజేస్తానని ఎంపీ చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై మాట్లాడే ముందు జిల్లాకు ఎంపీ అర్వింద్ చేసిన అభివృద్ధి ఏమిటో పరిశీలించుకోవాలని సూచించారు. నిజామాబాద్ నుంచి మన్మాడ్, ముంబైకి డబుల్ లైన్ చేయాలని, ఎలక్ట్రికల్ రైళ్లు నడిచేలా చూడాలనే చిత్తశుద్ధి ఎంపీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు మాట్లాడొద్దని, నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలని సూచించారు. ఆర్వోబీకి మిగితా రూ.64కోట్లు తీసుకువచ్చి ఎంపీ ఫొటో పెట్టుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు జగన్ పాల్గొన్నారు.