గాంధారి, జూన్ 27:ఉమ్మడి జిల్లా రైతులు వ్యవసాయాధారంగా పంటలు సాగుచేస్తుంటారు. దీంతో కాలం అనుకూలిస్తేనే సాగుచేసిన పంటలు చేతికి వస్తాయి. లేదంటే నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. వర్షాధారంపై పంటలను సాగుచేసే రైతులు తమ భూముల్లో ప్రతి సంవత్సరం ఒక పంటను మాత్రమే సాగుచేస్తే అతివృష్టి, అనావృష్టి చీడపీడల నుంచి పంట దెబ్బతిని నష్టపోయే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయాధికారుల సూచనల మేరకు చాలా మంది రైతులు ఒకే రకమైన పంటను కాకుండా ఏకకాలంలోనే వేర్వేరు పంటలను సాగుచేస్తున్నారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో ఒక పంట నష్టపోయినా.. మరో పంటతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం కలుగుతున్నది.
అంతర పంటల సాగుపై అన్నదాత ఆసక్తి..
ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. చాలా మంది రైతులు తమ చేలలో ఒకే పంటను కాకుండా అంతరపంటలను సాగుచేస్తున్నారు. అవి కూడా ఒకేసారి పంట చేతికి వచ్చేవి కాకుండా వేర్వేరు కాల పరిమితుల్లో వచ్చే రెండు పంటలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, రామారెడ్డి, లింగంపేట, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, జుక్కల్, మద్నూ ర్, పెద్ద కొడప్గల్ తదితర మండలాల్లో ఎక్కువగా నల్లరేగడి భూములతోపాటు చెలక, తరుక, దుబ్బ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో కేవలం వర్షాధారంపై మాత్రమే పంటలను సాగుచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రాంత రైతులు పత్తి, మక్కజొన్న, సోయా, కంది, మినుము, పెసర, జొన్న తదితర పంటలను సాగుచేస్తున్నారు. ఒక పంటలో మరో పంటను అంతర పంటగా వేర్వేరు సాళ్లలో వేస్తున్నారు.
అంతరపంటగా కంది..
నల్లరేగడి భూముల్లో పత్తి, మక్కజొన్న, సోయా, మినుము, పెసర పంటలను ప్రధానంగా సాగుచేస్తున్నారు. రైతులు ఈ పంటలను సాగుచేసేటప్పుడు కేవలం ఒకే రకమైన పంట కాకుండా వాటిలో మరో పంటను వేస్తున్నారు. నల్లరేగడి భూముల్లో మొదట ఏ పంట సాగుచేసినా.. అందులో అంతరపంటగా కందిని సాగుచేసుకోవచ్చు. మక్కజొన్నతో పాటు సోయా, మినుము, పెసర తదితర పంటలన్నీ 90 రోజుల్లోనే చేతికి వస్తాయి. ఈ రకం పంటలు సాగుచేసే రైతులు కంది పంటను వేసుకోవడం అనుకూలంగా ఉంటుంది.
సాళ్ల మధ్యలో ఇలా..
పత్తిలో అంతరపంటగా కందిని వేయాలనుకునే రైతులు ప్రతి ఐదు సాళ్లకు ఒక సాలు చొప్పున వేయాలి. మక్కజొన్న పంటలో అయితే ఆరు సాళ్లకు ఒక సాలు, సోయా, మినుము, పెసర పంటల్లో కూడా ఆరు సాళ్లకు ఒక సాలు చొప్పున కంది పంటను వేసుకోవచ్చు. మినులు, పెసర, సోయా పంటల్లో అంతర పంటలుగా కొర్రలు, జొన్న, ఆముదం వంటి పంటలను ఐదారు సాళ్లకు ఒక సాలు చొప్పున సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు బీర, దోస, చిక్కుడు తీగలతోపాటు మిరప, టమాట, వంకాయ వంటి కూరగాయలను కూడా అంతరపంటగా సాగుచేసుకునే అవకాశం ఉన్నది.
అంతర పంటల సాగుతో లాభాలు..
ఒకే సమయంలో వేర్వేరు కాలపరిమితులతో కూడిన పంటలు సాగుచేయడంతో ఒక పంటతో నష్టం వచ్చినా.. మరో పంటతో భర్తీ చేసుకోవచ్చు.
భూమిలో పోషకాలు పెరుగుతాయి.
కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.
అంతర్ పంటల సాగుతో పొలం కోతకు గురికాకుండా భూసారాన్ని సంరక్షించుకోవచ్చు.
ప్రధాన పంటలపై చీడపీడల ఉధృతి తగ్గుతుంది.
గాలి, వెలుతురు సరిగా తగిలి పంటలు అధిక దిగుబడి ఇస్తాయి.
ప్రకృతి అనూకులిస్తే డబుల్ ఆదాయం వస్తుంది.
ఒకేసారి రెండు పంటలను వేయడంతో కీటకాలు పంటలను గుర్తించడం కూడా కష్టమే.