నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26: పచ్చదనంతోపాటు ఆహ్లాదం పంచుతున్నది కాలూర్ ప్రకృతి వనం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమై ఏర్పడిన ఒకటో డివిజన్ పరిధిలోని కాలూర్లో అన్ని హంగులతో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పల్లెప్రకృతి వనం ఎంతగానో దోహదపడుతోంది. పట్టణప్రకృతి వనం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, స్థానిక కార్పొరేటర్ కోర్వ లలితా గంగాధర్ సమష్టికృషి ఫలితంగా రూ.15లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో జడ్పీ హైస్కూల్ ఆవరణ ఎదురుగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. స్వచ్ఛమైన వాయువును అందిస్తున్నాయి. పిల్లల కోసం ఊయల, జారుడుబండ తదితర వాటిని ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలు నిత్యం పార్కుకు వచ్చి ఆటల్లో మునిగి తేలుతున్నారు. చుట్టూ వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ చేసేందుకు తరలివస్తున్నారు. ప్రకృతివనంలో నాటిన మొక్కలకు మున్సిపల్ కార్మికులు నిత్యం నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. ప్రకృతివనంలో కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. నగర మేయర్ దండు నీతూకిరణ్, కమిషనర్ జితేశ్ వీ పాటిల్, కార్పొరేటర్ కోర్వ లలిత ఇటీవల ప్రకృతివనాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలూర్లో హరితహారం కింద నర్సరీలో మొక్కలను పెంచుతున్నారు.
పట్టణ ప్రగతితోనే అభివృద్ధి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతోంది. ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న ఖానాపూర్, కాలూర్ గ్రామాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. కాలూర్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతివనం గ్రామస్తులందరికీ ఎంతగానో ఉపయోగకరంగా మారింది. ఖానాపూర్లో కూడా త్వరలోనే పట్టణ ప్రకృతివనం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను.