నిజామాబాద్, జూన్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సాయంత్రం సమయంలో కుటుంబ సమేతంగా కాసేపు ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రకృతి వనాలు అనే కార్యక్రమాన్ని రూపొందించింది. పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ఈ వనాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు 2020 నుంచి స్థల సేకరణ చేపట్టి వనాల ఏర్పాటు పనులను పురపాలక, పంచాయతీ శాఖలు ప్రారంభించాయి. నిజామాబాద్ జిల్లాలో 530 జీపీల్లో, కామారెడ్డి జిల్లాలో 526 జీపీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.ఒకప్పుడు నిర్మానుష్యంగా ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో అడవిని తలపించిన స్థలాలు నేడు ఆహ్లాదానికి చిరునామాగా మారాయి.
వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేశారు. వివిధ రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కల మధ్యలో కాలినడక(వాకింగ్ ట్రాక్), కూర్చోవడానికి బల్లలు అందుబాటులోకి తెచ్చారు. గతేడాది ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమంలో 14 రకాల అంశాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు జారీ చేశారు. ఈ అంశాల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి పురపాలకానికి ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నారు. వీటితోపాటు ప్రతి ఏటా పురపాలక సంఘాలు రూపొందించుకునే బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్గా వినియోగించేలా కొత్త పురపాలక చట్టం -2019లో స్పష్టం చేయడంతో పచ్చదానికి ప్రాధాన్యత పెరిగింది.
హరితహారానికి సన్నద్ధత…
హరితహారం ఏడో విడుత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు సిద్ధమవుతున్నాయి. వానలు కురుస్తుండడంతో ఆయా శాఖల అధికారులు ముందస్తు పనులు చేపట్టారు. ఇప్పటికే ఈజీఎస్ ఆధ్వర్యంలో కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. అటవీ శాఖాధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతా ల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన నర్సరీల్లో అడవులు వృద్ధి చేసే మొక్కలు, కలప మొక్కలు, కోతులకు ఉపయోగపడేలా పండ్ల మొక్కలు ఎక్కువగా పెంచుతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీల్లో పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నారు. ఆబ్కారీ ఆధ్వర్యంలో చెరువుల గట్టున ఈత మొక్కలు ఎక్కువగా నాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రధానంగా మొక్కలు నాటేలా ఈసారి ప్రణాళికలు సిద్ధం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
గ్రామాలే దేశానికి వెన్నెముక అని గాంధీ చెప్పినట్లుగా రాష్ట్రంలోని పల్లెలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దే పనిలో సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు ఊపిరి ఊదుతున్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఆర్థికంగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, పరిశుభ్రత, మొక్కల సంరక్షణ వంటి చర్యలతో గ్రామాల రూపురేఖలు రోజురోజుకూ మారుతున్నాయి. అంతేగాకుండా గ్రా మాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. గడిచిన కొద్ది రోజులుగా పల్లెప్రగతి పేరిట ఊరంతా ఏకమై వీధులను, నివాసాలను, ప్రజాబాహుళ్య ప్రాంతాలను బాగు చేసుకుంటూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్యమంలా కొనసాగుతున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అనేక చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం జోరుగా పాలు పంచుకుంటున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పల్లె, పట్టణ ప్రగతిపై సీరియస్గా దృష్టి సారించడంతో అధికారులంతా క్షేత్ర స్థాయికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే రెండు విడుతలుగా జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసేందుకు 28వ తేదీన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.