నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రానున్న మూడు వారాల సమయం నిజామాబాద్ జిల్లాకు అత్యంత కీలకమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు టెస్టుల కోసం ఎదురు చూడకుండా వెంటనే ఐసొలేట్ కావడం, చికిత్సను ప్రారంభించుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్లాస్మా లభ్యతను స్థానికంగానే ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం మూలంగా నిజామాబాద్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని వివరించారు. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ చికిత్స కోసం బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు సేవలు విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటులో ధరల దోపిడీ, రెమ్డెసివిర్ పేరిట జరుగుతున్న తంతును పరిశీలించేందుకు ప్రతి ఐదు ప్రైవేటు దవాఖానలకు ఓ జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా సోకిన బాధితులతో ప్రైవేటు దవాఖానల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటివి సహించలేనిదని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మీడియాతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్సులో కలెక్టర్ సూచించారు. (ఆయన మాటల్లోనే)
మహారాష్ట్ర ముప్పుతోనే..
సెకండ్ వేవ్ మొదలైన అనంతరం మహారాష్ట్రలో ఎక్కువ కేసులు వస్తున్నాయి. అందులో నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉండడంతో వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. ఇప్పుడు ఈ పరిస్థితిలో కరోనా వైరస్ వ్యాప్తి ఫాస్ట్గా ఉంది. మొదటి దశలో ఈ రకంగా వ్యాప్తి లేదు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. లక్షణాలు లేని వారు చాలా మంది ఉన్నారు. తక్కువ లక్షణాలతో బాధ పడుతున్న వారు కొద్ది మంది ఉన్నారు. దవాఖానలో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. గడిచిన ఏడాది అనుభవంలో తెలియని వైరస్ను ఎదుర్కోవడానికి కలిసి కట్టుగా పోరాడాం. మందులు, వాక్సిన్ లేకున్నా సమష్టి కృషితో బయటపడ్డాం. ప్రస్తుతం మందులు, వాక్సిన్ వచ్చాయి. అందరం కలిసి సంఘటితంగా పోరాడదాం. ప్రజలంతా సహకరించాలి. మూడు వారాలు ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది రావడం, వెళ్లడంతో ఎక్కువగా వ్యాప్తి జరుగుతున్నది. కరోనాకు సరైన చికిత్సతో బయట పడొచ్చు. కొంత మంది నాకేం కాదు అన్న దృక్పథంతో మొండిగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బయటి నుంచి వైరస్ ఇంట్లోకి వస్తున్నది. బయటికి వెళ్లే వ్యక్తులు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం. సీరియస్ కండీషన్కు వెళ్లే ఆస్కారం ఉంది. కరోనాకు మాస్కే కవచం. మాస్కులు ధరించాలి. ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడడం ముఖ్యం. కరోనా లక్షణాలుంటే టెస్టులు లేకున్నా.. వెంటనే ఐసోలేట్ కావాలి. చికిత్సను ప్రారంభించుకోవాలి. ఔషధాలు వాడాలి. లేకపోతే తీవ్రత పెరిగి ఇన్ఫెక్షన్ మూలంగా ముప్పు వాటిల్లుతుంది.
ఆర్మూర్లో కొవిడ్ సేవలు..
పాజిటివ్ పేషెంట్లు బయట తిరగడం బాధ్యతారాహిత్యం. ఇదీ ఎంతకూ క్షమించరానిది. మన మూలంగా వేరే వారికి హానికరం చేయకూడదు. పౌరులు బాధ్యతగా ఫీలైతేనే కట్టడి చేయ కలుగుతాం. వైద్య సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది వైద్యులు, వైద్యాధికారులు, కింది స్థాయి ఉద్యోగులు 12 నుంచి 15 గంటలు పని చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు కరోనా బారిన పడుతున్నప్పటికీ సేవలు ఆగడం లేదు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన మెటర్నిటీ వార్డులో సగం మందికి కరోనా సోకింది. అయినప్పటికీ వారంతా ధైర్యంగా పని చేస్తున్నారు. పెద్ద మనసుతో సేవలు కొనసాగిస్తున్నారు. జీజీహెచ్లో 500 బెడ్లు ఉంటే సామర్థ్యాన్ని 750కి పెంచాం. ఇందులో కొవిడ్ కోసం 500 బెడ్లు, నాన్ కొవిడ్ సేవలకు 250 బెడ్లున్నాయి. బోధన్లో వంద బెడ్లు సామర్థ్యం ఉండగా.. ఉన్న స్టాఫ్తో 150 బెడ్లు పెంచాం. ఇందులో 100 కొవిడ్, 50 నాన్ కొవిడ్ బెడ్లు చేశాం. ఆర్మూర్ 100 పడకల వైద్యశాల అయినప్పటికీ ప్రస్తుతం 30 పడకల స్టాఫ్తోనే సేవలు అందిస్తున్నాం. ఇక్కడ 130 బెడ్లు పెంచి 100 కొవిడ్ కోసం, 30 నాన్ కొవిడ్ సేవలు అందిస్తున్నాం. రెండు రోజుల్లోనే ఆర్మూర్లో కొవిడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. పీహెచ్సీల్లో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ధైర్యంగా కరోనా టెస్టులు చేస్తూ సహకరిస్తున్నారు.
ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు..
షాపింగ్ మాల్స్, సంతలు, మార్కెట్లలో గుంపులుగా ఉంటే ఇక ముందు పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. ప్రజా ప్రతినిధులు వారి శక్తి మేర ప్రజలకు సేవ చేయాలని తపిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత రెమ్డెసివిర్ కోసం ప్రభుత్వంతో మాట్లాడారు. ప్రైవేటు దవాఖానలపై రెమ్డెసివిర్పై ఫిర్యాదులు వస్తున్నాయి. రెమ్డెసివిర్ వాడకానికి ప్రొటోకాల్ ఉంది. ఆక్సిజన్ శాచురేషన్ తగ్గితేనే వాడాలి. అక్కడక్కడా అవసరం లేకున్నా వాడుతున్నారు. ముందే వాడడం అన్నది మంచిది కాదు. సాధారణ పేషెంట్లకు రెమ్డెసివిర్ ఇవ్వడం ద్వారా తీవ్రత ఉన్న వారికి ఔషధం దొరకడం లేదు. ప్రతి ఐదు ప్రైవేటు దవాఖానలకు ఒక జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించాం. కొవిడ్తో ఇబ్బంది పడుతున్న వారు మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ నిజామాబాద్లో సేవలు అందిస్తున్నాం. మానవతా దృక్పథంతోనే వైద్య సేవలు కల్పిస్తున్నాం.