డిచ్పల్లి, ఏప్రిల్ 18: ఇందల్వాయి మండల కేంద్రంలోని సీతారామ చంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తికారణంగా ఉత్సవాలను ఆలయ నిర్వాహకులే సాదాసీదాగా నిర్వహించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేసినప్పటికీ, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని వీడీసీ నిర్ణయించింది. ప్రతిఏడాది 11 రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చేవారు.
లక్ష్మణుడు లేని రామాలయం
సాధారణంగా ఏ రామాలయంలోనైనా రాములవారి విగ్రహంతోపాటు సీత, లక్ష్మణ, హనుమ విగ్రహాలుంటాయి. కానీ ఇందల్వాయి రామాలయంలో లక్ష్మణుడు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలోని విగ్రహాన్ని నిజామాబాద్లోని రఘునాథ ఆలయం నుంచి తీసుకువచ్చారని ప్రతీతి. విగ్రహాన్ని శివాజీ గురువు సమర్థ రామదాసు ప్రతిష్ఠించారని ఆలయ పురోహితులు తెలుపుతున్నారు. ఇక్కడి విగ్రహం ఆరడుగుల ఎత్తుతో చూడ రమణీయంగా చెక్కబడి ఉంటుంది. విగ్రహం చుట్టూ దశావతారాలు, లోపల మూడు సాలగ్రామాలు ఉంటాయి. ప్రతి రామాలయంలో కర్కాటక లగ్నంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం రాముని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని పొన్నచెట్టు వాహనసేవ ఇక్కడి ప్రత్యేకత.
ఏటా ప్రత్యేక ఉత్సవాలు
ప్రతి ఉగాది రోజు సంస్థాన పంచాంగ శ్రవణం, చైత్ర శుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు అధ్యయనోత్సవాలు, చైత్ర శుద్ధ సప్తమి రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు, అంకురార్పణ, నవమి రోజు ఉదయం రామజననం, సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. శీలం జానకీబాయి మునిమనవరాలు అనురాధారెడ్డి కుటుంబ సమేతంగా హాజరవుతారు. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున రథోత్సవాన్ని నిర్వహిస్తారు. రథాన్ని విదేశాల్లో ఉన్న భక్తులు సుమారు రూ.5లక్షలు వెచ్చించి చేయించారు. ఈ గ్రామంలో ఏ శుభకార్యం తలపెట్టినా స్వామివారిని తలచుకుని ప్రారంభిస్తారు.
ఆలయాన్ని నిర్మించిన జానకీబాయి
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఇంత రమణీయంగా చెక్కిన విగ్రహం ధ్వంసం కాకూడదనే ఉద్దేశంతో మరో చోటికి తరలించినట్లు పూర్వీకులు చెబుతారు. తర్వాత సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడి ఆలయ గర్భగుడి చిన్నగా ఉంటుంది. ఆలయానికి చుట్టూ సైనికులు పహారాకాసేందుకు నిర్మించిన బురుజుల శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి.పూర్వం ఇక్కడ కత్తుల కార్మాగారం ఉండేదని ప్రతీతి. ఈ ప్రాంతంలో నాణ్యమైన ఇనుప ఖనిజం లభించేదని, అది స్విట్జర్లాండ్లో లభించే ఖనిజం నాణ్యతతో పోలి ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ తయారుచేసిన కత్తులు వివిధ దేశాలకు ఎగుమతి చేసేవారని చెబుతుంటారు.
బ్రహ్మోత్సవాలు ఇలా..
చైత్రశుద్ధ సప్తమి సోమవారం సాయంత్రం అంకురార్పణ, 20న ధ్వజారోహనం, 21న ఉదయం శ్రీరామ జననం, సాయంత్రం 5గంటలకు స్వామివారి కల్యాణం గుర్రపు సేవ, 22న స్వామివారి హనుమంత సేవ, 23న శేషవాహన సేవ, 24న హనుమంత సేవ, 25న పొన్నచెట్టు సేవ, 26న గరుడసేవ, 27న చైత్రశుద్ధ పౌర్ణమి స్వామివారి రథోత్సవం, 28న చక్రతీర్థం, 29న నాగవెల్లి ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.