నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 14 : పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం ఆత్మకూర్ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామాలు మెరిసిపోతున్నాయి. పల్లెలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఆహ్లాదానికి చిరునామగా నిలుస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో వైకుంఠధామం, ప్రకృతివనం, డంపింగ్యార్డు, కోతుల ఆహారశాల పనులను పూర్తి చేశారు. గతంలో గ్రామంలో అస్తవ్యస్త నీటి సరఫరా, డ్రైనేజీలు లేక రోడ్లపైనే మురికి నీటి ప్రవాహం వంటి సమస్యలు కనిపించేవి. అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో పన్నులు సైతం వసూలు అయ్యేవి కావు. ప్రస్తుతం గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నులు వసూలు అవుతున్నాయి. గ్రామంలో ప్రతిరోజూ చెత్త సేకరించడానికి ట్రాక్టర్ను ఏర్పాటు చేశారు. సేకరించిన చెత్తను గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు డ్రైనేజీల ను శుభ్రం చేయడంతో పాటు చెత్త సేకరించడం, బ్లీచింగ్పౌడర్ చల్లడంతో గ్రామంలో వ్యాధులు ప్రబలడం తగ్గిపోయాయి.
అందరి సహకారంతో అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రారంభించిన పల్లె ప్రగతితో గ్రామాలు మెరుస్తున్నాయి. గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు పూర్తి చేసుకుంటున్నాం. అందరి సహకారంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకున్నాం.
-బాల్రెడ్డి, సర్పంచ్