నిజాంసాగర్, ఏప్రిల్ 14: కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 6న సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఆ నీరు మరో వారం రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. మంజీరానది పరీవాహక ప్రాంతంలో రూ.476.25 కోట్లతో నాగమడుగు మత్తడి నిర్మించనుండగా పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ త్వరలో నిజాంసాగర్కు వస్తారని చెప్పారు. ఈమేరకు ప్రాజెక్టు వద్ద సీఎం రాకకోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆయన జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జడ్పీ మాజీ చైర్మన్ రాజు, నిజామాబాద్ ఇరిగేషన్ సీఈ మధుసూదన్, ఇతర అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనులను నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, పనులు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు వద్ద భోజనం చేస్తారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వారి వెంట నిజాంసాగర్ ఎంపీపీ పట్లోల్ల జ్యోతి, నాయకులు దుర్గారెడ్డి, విఠల్, గంగారెడ్డి, మనోహర్, రమేశ్గౌడ్, ఇరిగేషన్ ఎస్ఈ మురళీధర్, ఈఈ రమేశ్, డీఈఈలు దత్రాద్రి, భూంరెడ్డి, శ్రావణ్కుమార్ తదితరులు ఉన్నారు.
చకచకా సాగుతున్న పనులు..
సీఎం రాక సందర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద పనులు చకచకా సాగుతున్నాయి. ప్రాజెక్టు వద్ద ఉన్న గుల్దస్తా అతిథి గృహాన్ని ముస్తాబు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పెయింటింగ్, సిమెంటు పనులతో పాటు హైమాస్ట్ లైట్లను బిగిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద బుధవారం బోరును వేసి మోటరును బిగించారు. సుల్తాన్నగర్ శివారులో హెలీప్యాడ్, జక్కాపూర్ వద్ద నాగమడుగు పనులకు సబంధించిన పైలాన్ నిర్మాణం చురుకుగా సాగుతున్నది. ప్రాజెక్టు వెళ్లే దారి బాగుపడడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజుల్లో పనులు పూర్తి..
నిజాంసాగర్ వద్ద చేపడుతున్న పనులు నాలుగు రోజుల్లో పూర్తవుతాయని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్ అన్నారు. ప్రాజెక్టు వద్ద చేపడుతున్న మరమ్మతు పనులను ఆయన బుధవారం పరిశీలించారు. పనులను పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించామని చెప్పారు. గోదావరి నీళ్లు హల్దీవాగులోకి రెండు రోజుల క్రితమే చేరాయని మరో వారం రోజుల్లో నిజాంసాగర్కు చేరుకుంటాయని తెలిపారు. నిజామాబాద్ సీఈ మధుసూదన్, ఎస్ఈ మురళీధర్, ఈఈ రమేశ్, డీఈఈలు దత్తాద్రి, భూంరెడ్డి, శ్రావణ్కుమార్ తదితరులు ఉన్నారు.