కారకులైనవారిని శిక్షించాలని మృతుడి బంధువుల ఆందోళన
ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సైపై కేసు నమోదు
గాంధారి మండలం మాధవపల్లిలో ఘటన
గాంధారి, జూన్ 9 : మండలంలోని మాధవపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. ఆత్మహత్యకు కారకులైనవారిని శిక్షించాలని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు, స్థానిక ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మాధవపల్లి గ్రామానికి చెందిన బాజారావుకు రజిత, సంతోషి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పదిహేను ఏండ్ల క్రితం మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన శివాజీని (35) ఇల్లరికం తీసుకువచ్చి, పెద్ద కూతురు రజితతో వివాహం జరిపించారు. రజితకు ఒక కూతురు పుట్టిన తర్వాత ఆమె మృతిచెందింది.
దీంతో పెద్దలందరి అంగీకారంతో బాజారావు చిన్న కూతురు సంతోషితో శివాజీకి వివాహం జరిపించారు. వివాహం అనంతరం సంతోషికి ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కామారెడ్డిలో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్న సంతోషి.. శివాజీ, తల్లిదండ్రులతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్నారు. శివాజీ భార్య సంతోషితో నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్రెడ్డికి వివాహేతర ఉన్నది. ఈ విషయం తెలిసిన శివాజీ పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన శివాజీ మంగళవారం రాత్రి మాధవపల్లిలోని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతోపాటు మహారాష్ట్రకు చెందిన మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. శివాజీ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మృతుడి భార్యతోపాటు వారి కుటుంబసభ్యులను పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి బంధువులకు ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తమ్ముడు బాలాజీ ఫిర్యాదు మేరకు భార్య సంతోషితోపాటు ఎస్సై శివప్రసాద్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.