నిజామాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి ఫలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసేందుకు జిల్లాల బాట పట్టారు. బుధవారం నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా వేల్పూర్కు వచ్చారు. మంత్రి వేముల నివాసంలో రాత్రి బస చేసిన ఆయన గురువారం ఉదయం ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామస్తులతో ముచ్చటిస్తూ, ప్రగతి పనులను పరిశీలిస్తూ, సలహాలు అందిస్తూ క్షేత్ర పర్యటన చేశారు.
జరిమానా విధించి.. అవగాహన కల్పించిన ఎర్రబెల్లి
వేల్పూర్లో గురువారం ఉదయం మంత్రి వేములతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠధామం, రైతు వేదికలను సందర్శించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ విశేషాలను మంత్రి ఎర్రబెల్లికి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. తన తండ్రి సురేందర్ రెడ్డి పేరిట నిర్మించిన స్మృతి వనం, రైతు వేదికలను ఎర్రబెల్లికి చూపించారు. రైతువేదిక ప్రాంగణంలో వారు మొక్క లు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తుండగా ఓ కిరాణా దుకాణం ఎదుట చెత్త పోగైన తీరును మంత్రి ఎర్రబెల్లి గమనించారు. యజమానితో మాట్లాడారు. చెత్తను నిర్లక్ష్యంగా వదిలేసి ఇతరులకు ఇబ్బందులు సృష్టించవద్దని సూచించి రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ…
ప్రజల సంక్షేమం కోసం వినూత్న పథకాలు, భిన్నమైన కార్యక్రమాలను అమలు చేస్తుండడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఎక్కడా లేని విధంగా గ్రామా ల సర్వతోముఖాభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా తీసుకువచ్చిన ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని అన్నారు. గ్రామంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం ఇండ్లలో, రోడ్లపై పేరుకుపోయిన తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని సర్పంచ్, కార్యదర్శిని కోరా రు. చెత్తను ప్రాసెస్ చేసి రైతుల పొలాల్లో సేంద్రియ ఎరువుగా వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తరలించడానికి, హరితహారం మొక్కలకు నీటి సౌక ర్యం కల్పించడానికి రాష్ట్రంలో 12,769 జీపీలకు ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు సమకూర్చామని మంత్రి వివరించారు.
సర్వతోముఖాభివృద్ధి దిశగా గ్రామాలు…
పల్లె ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 660 పల్లె ప్రకృతి వనాలు, 521 వైకుంఠధామాలు, 529 డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టి పూర్తి చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గ్రామ అభివృద్ధికి నిధుల కొరత లేదని, ప్రతి నెలా రూ.308 కోట్లు స్థానిక సంస్థలకు గ్రాంటుగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.167 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలను సమగ్ర అభివృద్ధికి కేరాఫ్గా నిలిపే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. ఇదే సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ వినూత్న కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. వేల్పూర్లో గ్రామాభివృద్ధి బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనంలో ఫెన్సింగ్ కోసం కాగితపు పూల మొక్కలను నాటాలని మంత్రులు సూచించారు.