నిజాంసాగర్, మే 2 : దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడంతో మంజీర పరివాహక ప్రాంతం బోసిపోవడంతో నిజాంసాగర్లో నీటి జాడలు లేక కళాహీనంగా మారి ఆయకట్టుకు సాగునీరు అందకుండా ఉత్సవ విగ్రహంగా మారిం ది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్లోకి మళ్లింపు చేయడంతో నేడు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది.
దేశంలోనే మొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు..
1931 సంవత్సరంలో నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో మంజీరానదిపై నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 29.72 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే విధంగా నిర్మించారు. 1972 సంవత్సరం తర్వాత ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యం గణనీయంగా 11.79 టీఎంసీలకు పడిపోయింది. 1978లో ప్రాజె క్టు వరద గేట్లను ఐదు ఫీట్లు పెంచి 17.80 టీఎంసీలకు చేర్చారు. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాం తాల్లో అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడం, నిజాంసాగర్ ఎగువ భాగంలో సింగూరు ప్రాజెక్టు నిర్మించడం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిర్మించి నిజాంసాగర్ ఆయకట్టు కొంత మేరకు స్థిరీకరించడంతో నిజాంసాగర్ ఆయకట్టు 2.31 లక్షల ఎకరాలకు పరిమితమైంది.
రోజు రోజుకూ కళావిహీనంగా మారిన నిజాంసాగర్..
నిజాంసాగర్ ప్రాజెక్టు 2.75 లక్షల ఎకరాల ఆయక ట్టు 2.31 లక్షలకు చేరుకోవడం.. నిజాంసాగర్ ప్రాజె క్టు ఎగువ భాగంలో అక్రమ ప్రాజెక్టులను నిర్మించడం తో పాటు సింగూరు ప్రాజెక్టును నిర్మించడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొన్నేండ్లుగా ఇన్ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు లేక కళావిహీనంగా మారింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టును నమ్ముకొని ఉన్న 2.31 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు సాగు నీరు అందక కొన్ని సంవత్సరాలుగా వేసిన పంటచేతికి అందేదాక నమ్మకం లేకుండా ఉండేది. అలాంటిది గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి హల్దీవాగు ద్వారా గతనెల 6వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేయడంతో నిజాంసాగర్లోకి నీటి విడుదల ప్రారంభమైంది.
జలకళను సంతరించుకుంటున్న సాగర్..
మంజీరానదిలోకి వరద ప్రవాహంతో సంబంధం లేకుండానే కాళేశ్వరం జలాలను నిజాంసాగర్లోకి తరలించడంతో పాత రోజులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటూ సుమారు ఏడు టీఎంసీల నీరు నిలువకు చేరుకున్నది. దీంతో ఆయకట్టు రైతులు మునుపటి రోజులు వచ్చాయని ఇక రెండు పంటలకు ఢోకా లేద ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాగర్కు పూర్వవైభవం..
నిజాంసాగర్ ప్రాజెక్టుకు హల్దీవాగు ఆయువు పట్టుగా నిలిచింది. గోదావరి నీరు హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఊపిరి పోసేలా నిలవడం నిజంగా అద్భుతమే. గోదావరి జలాలు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్పేట ఖాన్ చెరువు నుంచి ఆరంభమయ్యే హల్దీవాగు యావాపూర్ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. మెదక్ జిల్లాలో 47 కిలో మీటర్లు ప్రవహించి మెదక్ మండలంలో ర్యాలమడుగు-ఎల్లాపూర్ వద్ద మంజీరానదిలో కలుస్తున్నది. మంజీర వాగు పరుగులు తీస్తూ గోదావరి జలాలు కామారెడ్డి జిల్లాలోని నాగిరేడ్డిపేట మండలం గోలిలింగాల నుంచి నిజాంసాగ్లోకి చేరుతున్నాయి. వారం రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తుండడం తో ప్రాజెక్టులో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతున్నది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.