ఇందూరు, జూన్ 1: జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి వారం రోజులపాటు శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్లోని కలెక్టరేట్ నుంచి పలు విషయాలపై మండలాల్లోని అధికారులతో ఆయన మంగళవారం జూమ్ యాప్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో టాస్క్ఫోర్స్ అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రభుత్వం రేషన్కార్డుదారులకు అందించే 15 కిలోల ఉచిత రేషన్ బియ్యాన్ని 5వ తేదీ నుంచి పంపిణీ చేయాలన్నారు. హరితహారం కార్యక్రమానికి పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించుకోవాలని, మొక్కలు నాటేందుకు స్థలాలను ఇప్పటి నుంచే ఎంపిక చేసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులను త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. గడ్డి విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారిని, ఎంపీ లాడ్స్కు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయాలని జిల్లా ప్రణాళిక అధికారిని కలెక్టర్ ఆదేశించారు. మాస్కులతోపాటు ఇతర వస్తువులు తయారు చేయాలని జైళ్లశాఖ సూపరింటెండెంట్కు సూచించారు. కరోనా కట్టడికి ఇంటింటా జ్వర సర్వే ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇదే టీం వర్క్తో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కూలీల సంఖ్యను పెంచుకోవాలి..
వానకాలం సీజన్ ప్రారంభం అవుతున్నందున వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు కూలీల సంఖ్యను పెంచుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. మూడో తేదీ నుంచి వారం రోజులపాటు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. వీసీలో డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.