ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
తొలి ఏడాదిలోనే దీన్దయాళ్ అవార్డు
సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో చైర్మన్ దాదన్నగారి విఠల్రావు
ఖలీల్వాడి, జూలై 5 : నిజామాబాద్ జిల్లా పరిషత్ మూండేండ్ల ఆదర్శవంతమైన పాలనను పూర్తిచేసుకున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రికార్డుల నిర్వహణ, స్థాయీ సంఘ సమావేశాలు, సర్వసభ్య సమావేశాలు, చైతన్య కార్యక్రమాల నిర్వహణపై తొలి ఏడాదిలోనే దీన్దయాళ్ అవార్డును దక్కించుకున్నారు.
అభివృద్ధిలో ముందంజ..
జడ్పీ నిధులతో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. దీన్దయాళ్ అవార్డు ద్వారా వచ్చిన రూ. 50 లక్షలతో మడిగెలను నిర్మించారు. రూ. 3.60 కోట్లతో గాలిబ్నగర్ నుంచి మాందాపూర్ వరకు 6 కిలోమిటర్ల మేర బీటీ రోడ్లు వేశారు. ధర్మోరా చెరువు నుంచి బొంకన్పల్లి, ముల్లంగి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోసం రూ. 11 కోట్ల నిధులను వెచ్చించారు. రూ. 17.48 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. వెంకటాపూర్, రాంపూర్ దేవాదాయ శాఖ ద్వారా రూ. 50 లక్షలతో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం, రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తిచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
జడ్పీ చైర్మన్కు ప్రజాప్రతినిధుల అభినందన..
మాక్లూర్, జూలై 5: జడ్పీ చైర్మన్గా మూడేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న దాదన్నగారి విఠల్రావును మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, మండలంలోని సర్పంచులు అభినందించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్మన్ చాంబర్లో ఆయనను మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శంకర్గౌడ్, సర్పంచులు అశోక్రావు, లింగన్న, ప్రవీణ్, గంగాధర్నాయక్, మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కంటెగారి శ్యాంరావు, సాదుల భోజన్న, మధుసూదన్రావు పాల్గొన్నారు.