బాన్సువాడ, అక్టోబర్ 20: చదువుల్లో సత్తా చాటుతూ ఆటల్లో అదరగొడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అన్న నానుడి నిజం చేస్తున్నారు గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు కడావత్ ప్రియాంక, కడావత్ సుప్రియ. వీరిద్దరూ బాన్సువాడ మండలంలో కొత్తాబాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుంచే వాలీబాల్ క్రీడలో సత్తా చాటుతూ ఏకంగా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకూ ప్రాతినిధ్యం వహించారు. వాలీబాల్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ అక్కాచెల్లెల్లు సుమారు 11సార్లు తెలంగాణ రాష్ట్ర జట్టులో కామారెడ్డి జిల్లా తరఫున నేషనల్స్కు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. పాఠశాల స్థాయి నుంచి పీఈటీ కాట్రోత్ సురేందర్ శిక్షణలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు.
కుటుంబ నేపథ్యం..
నిజాంసాగర్ మండలంలోని దూప్సింగ్తండాకు చెందిన కడావత్ గోపాల్-బీజన్ బాయి దంపతులకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబం. కడావత్ ప్రియాంక కొత్తాబాది జడ్పీ హైస్కూల్లో 10 వరకు చదివింది. ఇంటర్మీడియట్ కొత్తాబాది ఆదర్శ పాఠశాలలో, డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలోని పూర్తి చేసింది. యూజీ డీపెడ్ చదివి, పీసెట్లో రాష్ట్రస్థాయి తొమ్మిదో ర్యాంకు సాధించింది. 2018 సంవత్సరంలో జూన్ 2న రాష్ట్ర ఆవరతణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియాంక రూ.50వేల నగదు బహుమతిని కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నది. కడావత్ సుప్రియ 10వ తరగతి వరకు కొత్తాబాది జడ్పీ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ బాన్సువాడ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో చదివింది. స్పోర్ట్స్ అకాడమీలో ఉన్నందున ఓపెన్ విధానంలో డిగ్రీ చదువుతున్నట్లు పీఈటీ సురేందర్ తెలిపారు. ప్రాక్టీస్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీలో ఉంటున్నా.. కామారెడ్డి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇప్పటి వరకు 11సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నది. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది.
కడావత్ ప్రియాంక పాల్గొన్న టోర్నీలు..
సుప్రియ పాల్గొన్న టోర్నీ లు..
ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం
కొత్తాబాదిలో చదువుతున్న రోజుల్లోనే వాలీబాల్ అంటే ఆసక్తి. పీఈటీ సురేందర్ సార్ శిక్షణతో నిత్యం ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఉమ్మడి జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు చాలాసార్లు, రాష్ట్రస్థాయిలో 16 సార్లకుపైగా ప్రాతినిధ్యం వహించాం. మా చెల్లి సుప్రియ నాతోపాటు జట్టులో ప్రాతినిధ్యం వహిస్తుంది. జాతీయస్థాయి పోటీలకు 11సార్లు కామారెడ్డి జిల్లా తరఫున ఆడాం. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకు సాగుతాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలన్నదే ఆకాంక్ష.
– ప్రియాంక, కాంట్రాక్ట్ పీఈటీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, బాన్సువాడ
నేషనల్స్కు ఆడడం సంతోషకరం..
విద్యార్థి దశ నుంచే ప్రియాంక, సుప్రియలకు వాలీబాల్ క్రీడపై ఆసక్తి ఉండేది. కరోనా సమయంలో కూడా వారు శిక్షణ పొందారు. నేర్పే వారికన్నా నేర్చుకునే వారికి ఆసక్తి ఉంటే ఆటలో ప్రతిభ కనబరుస్తారు. ఇద్దరూ జాతీయస్థాయిలో ఆడడం చాలా సంతోషంగా ఉంది. మంచి భవిష్యత్తు ఉండాలి.
– కాట్రోత్ సురేందర్, పీఈటీ, జడ్పీహెచ్ఎస్ నెమ్లి, నస్రుల్లాబాద్
మా కాళ్లపై మేము నిలబడాలి..
జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అక్కతోపాటు పాల్గొని ప్రతిభ చాటాను. ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్థిక వనరులు అవసరం. మా కాళ్లమీద మేము నిలడాలన్నదే కోరిక. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉంది. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో ఆడి సత్తా చాటుతాం.
– సుప్రియ, వాలీబాల్ క్రీడాకారిణి