రైతు తిరగబడ్డాడు. పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి మూడేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్పై మరోసారి కన్నెర్ర చేశాడు. ఈసారి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి రైతు నిరసనాగ్నికి వేదికైంది. మంగళవారం ఆర్మూర్ పర్యటనకు వచ్చిన అర్వింద్ను అన్నదాతలు అడుగడుగునా అడ్డుకున్నారు. హామీలు నిలబెట్టుకోకపోవడంపై నిలదీశారు. అయితే నిరసనకారులపైకి అర్వింద్ వాహనం దూసుకెళ్లగా.. బీజేపీ శ్రేణులు రైతులపై దాడికి దిగారు. దీంతో ఎదురుతిరిగిన రైతులు ప్లకార్డు కర్రలు, చేతికందిన రాళ్లతో కాన్వాయ్పై విరుచుకుపడ్డారు. అర్వింద్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆందోళనలపై పోలీసులు ముందే వారించినా వినకుండా నిరసన ప్రాంతానికి బయల్దేరిన ఎంపీ.. ఆ తర్వాత తనపై హత్యాయత్నం జరిగిందని, పోలీసులు విఫలమయ్యారని పెడబొబ్బలు పెట్టడం నవ్వులపాలైంది.
పసుపుబోర్డు హామీపై కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్న రైతులు.. ఎంపీ అర్వింద్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డు తగులుతూ పసుపుబోర్డు హామీపై, పంటకు మద్దతుధరపై నిలదీస్తున్నారు. గత నెల 26న ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ఇదే తరహాలో అర్వింద్ను అడ్డగించారు. ఆందోళనకు దిగిన రైతుల పైకి వాహనాన్ని నడిపించగా.. ఒక మహిళా హోంగార్డు తీవ్రంగా గాయపడ్డారు. రైతుల ఆగ్రహావేశాల మధ్య తప్పించుకుని బయట పడిన బీజేపీ ఎంపీ.. తిరిగి మంగళవారం ఆర్మూర్లో అంతకుమించిన నిరసనను చవిచూశారు.
ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీని దారిపొడవునా అడ్డగించారు. పసుపు బోర్డు ఏదంటూ ప్లకార్డులు ప్రదర్శించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆర్మూర్ నుంచి నందిపేట మండలానికి వెళ్తున్న క్రమంలో ఇస్సాపల్లి గ్రామంలో అర్వింద్ కాన్వాయ్ని రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీ ఏమైందంటూ నిలదీశారు. ‘అర్వింద్ డౌన్ డౌన్..’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై నిరసన వ్యక్తంచేస్తున్న వారిపైకి ఎంపీ తన కాన్వాయ్తో దూసుకెళ్లాడు. ప్రాణాలతో తప్పించుకునేందుకు కర్షకులంతా పక్కకు తప్పుకున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరినందుకు తమపైకి వాహనాలతో తొక్కించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటంటూ రైతులంతా ఆందోళన చేశారు. బీజేపీ కార్యకర్తలు సైతం వారిపైకి దాడికి దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. చేతికందిన రాళ్లను వాహనాలపైకి విసిరారు. ప్లకార్డు కర్రలతో బీజేపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. అన్నదాతల ఆగ్రహానికి అర్వింద్ వాహనం ధ్వంసమైంది. ఒక్కసారిగా రైతుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో ధర్మపురి అర్వింద్ కంగుతిన్నాడు. రైతులతోపాటు స్థానిక ప్రజలు కూడా బీజేపీ శ్రేణులపైకి తిరగబడి తరమడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వలయంగా ఏర్పడి అర్వింద్ వాహనానికి రక్షణ కవచంగా నిలిచారు. ఘటనా స్థలి నుంచి ఆర్మూర్కు సురక్షితంగా తరలించారు.
ధర్నా డ్రామా…
మాట తప్పిన అర్వింద్పై పసుపు రైతులు మూడేండ్లుగా వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం ఆర్మూర్ నుంచి నందిపేట మండలానికి ఎంపీ వస్తున్నారని తెలిసి.. పరిసరప్రాంత ప్రజలంతా ఇస్సాపల్లి వద్ద నిరసన తెలుపాలని నిర్ణయించుకున్నారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు పసుపు బోర్డు అంశాన్ని అర్వింద్ పట్టించుకోవడం లేదు. పైగా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతుండడంతో కర్షకులు చాలా రోజులుగా ఆగ్రహంగా ఉన్నారు. గత నెల 26వ తేదీన ఇందల్వాయి మండలం గన్నారం వద్ద కూడా ఇదే తీరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన బీజేపీ ఎంపీకి రైతుల నుంచి నిరసన ఎదురైంది. గన్నారానికి వెళ్తున్న క్రమంలో రైతులపైకి కారును ఎక్కించి అమానవీయంగా ప్రవర్తించడం కూడా వివాదాస్పదమైంది. ఆ ఘటనలో ఓ మహిళా హోంగార్డు గాయపడ్డారు. మంగళవారం ఆర్మూర్ పర్యటనకు వచ్చిన అర్వింద్.. ఇక్కడ కూడా రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో కంగుతినాల్సి వచ్చింది. రైతులు ఊహించనివిధంగా తిరగబడటంతో పాలుపోని బీజేపీ ఎంపీ… పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వారిని నోటికొచ్చినట్లు తిడుతూ దుర్భాషలాడారు. నందిపేట మండలానికి వెళ్లే మార్గంలో పసుపు రైతులు నిరసనలు చేస్తున్నారని… పర్యటన వాయిదా వేసుకోవాలని ఆర్మూర్ పోలీసులు పదే పదే చెప్పినా.. ఎంపీ వినలేదు. పర్యటన వాయిదా వేసుకునేదే లేదని మొండిపట్టు పట్టారు. పైగా ఆర్మూర్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. చేసేది లేక పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని నందిపేటకు అనుమతించగా.. ఇస్సాపల్లిలో కర్షకుల కన్నెర్రతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
రైతులపై బీజేపీ నాయకుల దాడి…
ఇదిలా ఉండగా ఇస్సాపల్లిలో పసుపు రైతులపై బీజేపీ నాయకులు దాడి చేశారు. ‘ఎంపీ కాన్వాయ్కు అడ్డం తగులుతారా?’ అం టూ పిడిగుద్దులు గుద్దారు. పోలీసులు నిలువరించే ప్రయత్నంచేసినప్పటికీ బీజేపీ నాయకులు వినలేదు. కోపోద్రిక్తులైన అన్నదాతలంతా ఒక్కసారిగా మర్లబడ్డారు. తోకముడిచారు. దాదాపు కిలోమీటర్ దూరం వరకు రైతులు వారిని తరిమారు. కాన్వాయ్పైకి రాళ్లు విసిరారు. దీంతో అర్వింద్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే వాహనంలో వెనుతిరిగి నిజామాబాద్ చేరుకున్న అర్వింద్ నేరుగా సీపీ కేఆర్ నాగరాజును కలిశారు. తనపై హత్యాయత్నం జరిగిందంటూ ఫిర్యాదును అందించారు. సీపీ కా ర్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ మరోమారు పోలీస్ ఉన్నతాధికారులపై నోరు జారారు. ఈ ఘటనలో సీపీ పాత్ర ఉందంటూ అసంబద్ధ ఆరోపణలు చేయడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
దగా చేసిండు..
కమ్మర్పల్లి, జనవరి 25: పసుపు బోర్డు పేరిట ఎంపీ అర్వింద్ రైతులను దగా చేశాడని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. కమ్మర్పల్లిలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి.. స్పైస్ బోర్డు తెచ్చానని చెబుతూ రైతులను మోసం చేయడమేనన్నారు. పసుపునకు రూ.15వేల మద్దతు ధర ప్రకటించకపోతే కేంద్రానికి రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆర్మూర్ డివిజన్లో అధికంగా పసుపు సాగు చేసే రైతుల కోసం ఎంపీ అర్వింద్ కేంద్రంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు సారా సురేశ్, ప్రధాన కార్యదర్శి కే.రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు జి.కిషన్, కమ్మర్పల్లి అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
బోర్డు తెచ్చే వరకు ఇట్లనే నిలదీస్తం..
ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని ధర్మపురి అర్వింద్ బాండ్ రాసిండు. ఐదు రోజులు పాయే.. మూడేండ్లు దాటిపోవట్టే.. ఇన్ని రోజులు వేచి చూసినం. ఇక మీదట వేచి చూడం. తప్పకుండా పసుపు బోర్డు తేవాలి.. లేకుంటే జిల్లాలో ప్రతి రోజూ ఎంపీ అర్వింద్కు రైతులందరం నిరసన తెలుపుతం.