క్రీడారంగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయ యవనికపై ఇందూరుతో పాటు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు.
వేల్పూర్/విద్యానగర్, అక్టోబర్19 : పుట్టి పెరిగింది పల్లె ప్రాంతమైనా.. చదువుతోపాటు ఆటల్లోనూ సత్తా చాటుతున్నదీ విద్యార్థిని. ఆటలంటే ఆడపిల్లలను ఆమడ దూరం పెట్టే తల్లిదండ్రులు.. ప్రస్తుతం తను సాధించిన విజయాలను చూసి మురిసిపోతున్నారు. ఒక వైపు తైక్వాండో… మరో వైపు పరుగు పందెంలో ప్రతిభ కనబరుస్తున్న వేల్పూర్కు చెందిన హిరణ్మయి జాతీయ స్థాయిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన హిరణ్మయి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నది. ఒకవైపు తైక్వాండో మరోవైపు పరుగు పందెంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అడుతూ పలువురి ప్రశంసలు పొందుతున్నది. హిరణ్మయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ హిరణ్మయికి చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ ఉన్నది. ఆమెలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు తైక్వాండో, పరుగు పందెంలో శిక్షణ ఇప్పిస్తూ ప్రోత్సహించారు. ప్రతి రోజూ మైదానంలో సాధన చేస్తూ ఎన్నో మెళకువలను నేర్చుకున్నది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి ఎన్నో బహుమతులను గెలుచుకున్నది.
సాధించిన పథకాలు…
ఆత్మవిశ్వాసం పెరిగింది..
జిల్లాస్థాయిలో ఆడి రాష్ట్రస్థాయికి ఎంపికై అందులోనూ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మంచి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం. నా తల్లిదండ్రులు, అధ్యాపకులు,స్నేహితులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మరింత సాధనతో మున్ముందు ఎన్నో పతకాలను సాధిస్తా..
– హిరణ్మయి, తైక్వాండో, అథ్లెటిక్స్ క్రీడాకారిణి