నిజామాబాద్లో 3,860.. కామారెడ్డిలో 2,905 కేసుల పరిష్కారం
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు జారీ
దీర్ఘకాలిక న్యాయ వివాదాలకు మోక్షం
రాజ్యాంగ వ్యవస్థలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం
నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల
నిజామాబాద్ లీగల్, జూన్ 26 : వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. న్యాయవివాదాలను చట్టపరిధిలో పరిష్కరించుకుంటేనే వాటికి చట్టబద్ధత లభిస్తుందన్నారు. అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్రావు, షౌకత్ జహన్ సిద్ధిఖీ, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్తో కలిసి న్యాయసేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కేసులను కాలానికి అనుగుణంగా పరిష్కరించుకోవడంతో దీర్ఘకాలిక న్యాయ వివాదాలకు ముగింపు పలుకవచ్చని అన్నారు.
అన్ని వర్గాల ప్రజల మధ్య నెలకొన్న సివిల్, క్రిమినల్ వైషమ్యాల తొలగింపే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ అని పేర్కొన్నారు.అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్రావు, షౌకత్ జహాన్ సిద్ధిఖీ ప్రసంగిస్తూ మంచి సాహిత్యంతో కూడిన మధురమైన పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయన్నా రు. అలాగే మంచిని పెంచి, మనుషుల మధ్య సామరస్య పూర్వక పరిష్కారాన్ని చూపే జాతీయ లోక్ అదాలత్ కూడా పౌరుల మధ్య జాతీయ దృక్పథాన్ని పెంపొందించే అత్యుత్తమ వేదిక అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, భవ్య, గిరిజ, అజయ్కుమార్ జాదవ్, సంస్థ న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, మాణిక్రాజ్, ఆశ నారాయణ, జగన్గౌడ్, శ్రీకాంత్, రవిప్రసాద్, దయానంద్గౌడ్, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
95 లక్షల నష్టపరిహారం
నిజామాబాద్ నగరానికి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి చంద్రకాంత్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ప్రమాదానికి కారణమైన కారుకు బీమా చేసిన శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాధిత కుటుంబానికి మధ్య రాజీ కుదిర్చి 95 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తూ అదనపు జిల్లా జడ్జి పంచాక్షరి నేతృత్వంలోని లోక్అదాలత్ బెంచ్ అవార్డు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత బాధిత కుటుంబానికి రూ.95 లక్షల చెక్కును అందజేశారు. అప్పీలుకు వీలు లేని విధంగా బాధితులకు, బీమా కంపెనీకి రాజీ కుదర్చడం, పెద్ద మొత్తంలో ఆర్థిక అండ లభించడం న్యాయ సేవా సంస్థకు వన్నె తెస్తుందన్నారు.
3860 కేసుల పరిష్కారం
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 3860 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తెలిపారు. సివిల్ దావాలు 163, రాజీపడదగిన 3159, క్రిమినల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు 510, వివాహ సంబంధిత కేసులు 28 కక్షిదారుల అభిమతం మేరకు, మధ్యవర్తిత్వం నెరపి వారికి అనుకూలంగా అవార్డులు జారీ చేశామన్నారు. ఇందులో మోటారు రోడ్డు ప్రమాద దావాలు 54 ఉన్నాయని, రూ.2కోట్ల28లక్షల2వేల645 రోడ్డు ప్రమాద బాధితులకు అందేలా అవార్డులు జారీ చేసినట్లు వివరించారు.