నిజామాబాద్ క్రైం, ఆగస్టు 21 : జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నది. అయినప్పటికీ పోలీసుల కండ్లు గప్పి చాలాచోట్ల పాత నేరస్తులు చాకచక్యంగా నేరాలకు పాల్పడడం సవాలుగా మారింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా కె.ఆర్.నాగరాజు బాధ్యతలు చేపట్టిన అనంతరం నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కళ్లెం వేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రధాన ఏరియాలు, కూడళ్లు, కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొనే విధంగా ఏసీపీల ఆధ్వర్యంలో.. సీఐల పర్యవేక్షణలో సంబంధిత ఎస్సైలు, సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏదైనా నేరం జరిగి.. ప్రజలు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాని పక్షంలో కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు ఏ విధంగా ఉపయోగపడతాయో సవివరంగా తెలియజేస్తున్నారు. దీంతో చాలా చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏరియాలో జరిగిన నేరాలను ఛేదించడం పోలీసులకు సులభంగా మారింది. అంతే కాకుండా కొన్ని చోట్ల జరిగిన ఘర్షణలు, చైన్ స్నాచింగ్ సంఘటనల్లో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి వారిపై కేసులు సైతం నమోదు చేసినట్లు పోలీసుల రికార్డులో ఉన్నాయి.
ఆరు నెలల్లో రూ.28లక్షల 80 వేల సొత్తు చోరీ
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్, డిచ్పల్లి స్టేషన్ పరిధిలో రెండు చైన్ స్నాచింగ్ సంఘటనలతో పాటు ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, మోర్తాడ్లో ఒక చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. బోధన్ పట్టణంలో మరో సంఘటన చోటు చేసుకున్నది. మొత్తం ఎనిమిది కేసుల్లో రూ.28 లక్షల 80 వేల సొత్తు చోరీకి గురైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పోలీసులు తమకు లభించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రెండు కేసులను ఛేదించి రూ.లక్షా 70 వేల సొత్తు రికవరీ చేశారు. మిగతా కేసులను ఛేదించడంలో సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసుల పరిష్కారంలో ఆలస్యమవుతున్నది. మిగతా చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగిన ఏరియాల్లో సీసీ కెమెరాల నిఘా ఉండి ఉంటే ఆ కేసులను సైతం త్వరగా ఛేదించే ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు అవసరం
ఎక్కడ ఎలాంటి నేరం జరిగిన లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన వాటిని ఛేదించేందుకు మా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సంఘటనకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతున్నది.అయితే పోలీసులు కేసులను ఛేదించేందుకు ప్రజల సహకారంతో పాటు స్థానికంగా అన్నిచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే అనుకున్న సమయంకన్నా ముందుగానే మా సిబ్బంది కేసులను ఛేదిస్తారు. ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకొని పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం.
– నాగరాజు, కమిషనర్ ఆఫ్ పోలీస్