నిజామాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నది. మిషన్ కాకతీయ, ఈ-పంచాయతీ వంటి కీలక ఘట్టాల ప్రారంభోత్సవాలకు వేదికైన కామారెడ్డి గడ్డ మీదుగానే ఈ విప్లవాత్మక పథకం అమలు కానున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నేడు (బుధవారం) న్యూట్రిషన్ కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యధికంగా ఎనీమియా (రక్తహీనత)తో బాధ పడుతున్న తొమ్మిది జిల్లాల్లో ఒకేసారి ఈ పథకం మనుగడలోకి రానున్నది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వా ల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్లలోనూ ఒకే సమయంలో వర్చువల్ ద్వారా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీకి హ రీశ్రావు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా జి ల్లాలో 19,490మంది గర్భిణులకు లబ్ధి కలుగనున్నది.
కిట్లో ఏముంటాయంటే..
ఎనీమియాతో బాధపడే గర్భిణులకు పౌష్టికాహారం అం దించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశం. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల పంపిణీ లక్ష్యం. ఒక్కో కిట్కు రూ. 1962 చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తున్నది. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ మూడు బాటి ల్స్, 500 గ్రాముల నెయ్యి, అల్బెండజోల్ మాత్రలు, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ వంటివి కిట్లో భాగంగా ఉన్నాయి.
రూ.50 కోట్లతో..
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు ప్రసవ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవగాహన రాహిత్యంతో ప్రాణాల మీదకు వస్తున్నది. ఇలాంటి దుస్థితి పూర్తిగా తొలగిపోవాలని, ప్రసవ సమయంలో ఆడబిడ్డలకు ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగానే తొలి విడుతలో రూ.50 కోట్లు వెచ్చించి తొమ్మిది జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
రక్తహీనత నుంచి విముక్తి..
మాతా, శిశు సంరక్షణకు మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వసతులను కల్పించడంతో పాటు కేసీఆట్ కిట్ వంటి విప్లవాత్మక పథకాలను తీసుకొచ్చారు. సర్కారు దవాఖానాల్లోనే ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఎనీమియా లోపంతో గర్భిణులు పడుతున్న అవస్థలను, ప్రాణాంతకమైన ముప్పు నుంచి వారిని బయటకు తీసుకు వచ్చేందుకు మరో కార్యక్రమానికి కేసీఆర్ నడుం బిగించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ఉద్భవించింది. రక్తహీనత(ఎనీమియా) లోపం అన్నది గర్భిణులకు శాపంగా మారుతోంది. అలాంటి వారికి ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడంతో మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమ లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మాతృ మరణాలు తగ్గించడంలో విజయవంతమైంది. మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రయత్నాలుమొదలు పెట్టింది.
హరీశ్రావు పర్యటన ఇలా..
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభోత్సవానికి కామారెడ్డికి విచ్చేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సుమారుగా 4 గంటల పాటు ఇక్కడే పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు కామారెడ్డికి చేరుకుంటారు. జిల్లా కేంద్రంలో 50 పడకలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని పై అంతస్తుల్లో జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్కు చేరుకుంటారు. సమావేశ మందిరంలో ఉద యం 11 గంటలకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యా హ్నం 2గంటలకు హైదరాబాద్కు వెళ్తారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే న్యూట్రిషన్ కిట్లు జిల్లాకు చేరుకున్నాయి.
మరో చారిత్రక ఘట్టానికి వేదిక
నిజామాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి కంచుకోటగా నిలిచిన ఈ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాల్లో అనేక కీలకమైన ఘట్టాలకు సాక్షీభూతమవుతున్నది. సీఎం కేసీఆర్ ప్రారంభించిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు వేదికగా కామారెడ్డి జిల్లా నిలువగా చారిత్రక ప్రకటనలకు నిజామాబాద్ గడ్డ వేదికైంది. తాజాగా కేసీఆర్ న్యూ ట్రిషన్ కిట్ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి శ్రీకారం చుడుతున్న వేళ మరోమారు ఈ ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకుంటున్నది.
మొదటి ప్రభుత్వం లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు నిర్వహించిన క్రమంలోనూ ఈ-పంచాయతీ(పల్లె సమగ్ర సేవా కేంద్రం) కార్యక్రమానికి 2015, అక్టోబర్ 2న కామారెడ్డి జిల్లాలోని బీబీపేట వేదికగా నిలవడం చారిత్రక సందర్భమే. అంతకు ముందు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండ ల కేంద్రంలోని పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పథకాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే వచ్చి 2015, మార్చి 12న ప్రారంభించారు. ఇప్పుడు కేసీఆర్ పేరిట తీసుకు వస్తున్న న్యూట్రిషన్ కిట్ పథకం సైతం ఈ ప్రాంతం నుంచే షురూ అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ ఇందుకు వేదికగా నిలవనున్నది.