వైద్యారోగ్య శాఖ సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి
ఖలీల్వాడి, డిసెంబర్ 20 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని వైద్యాధికారుల వరకు ప్రతిఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. నవంబర్లో జిల్లాలో మొత్తం 2,784 కాన్పులు చేయగా… 57 శాతం ప్రభుత్వ దవాఖానల్లో, 43 శాతం ప్రైవేట్ దవాఖానల్లో ప్రసవాలు జరిగాయని తెలిపారు. గతంలో పోలిస్తే పరిస్థితి కొంతవరకు మెరుగుపడినప్పటికీ ఇంకా మార్పు రావాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కనీసం 65 శాతం ప్రసవాలు జరగాలని, లక్ష్యసాధన కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. లక్ష్యసాధనలో వెనుకబడిన పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందిని కలెక్టర్ కారణాలు అడిగి తెలుసుకున్నారు.
లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చేరిన తర్వాత కొంతమంది గర్భిణులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి కాన్పులు చేయించుకుంటున్నారని, ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకొని లోటుపాట్లను సరి చేసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, శిబిరాల నిర్వహణ గురించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యం, హరితహారం నిర్వహణ మరింత మెరుగుపడాలి
జిల్లావ్యాప్తంగా శానిటేషన్, హరితహారం నిర్వహణను మరింతగా మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. నూతన కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హరితహారం, శానిటేషన్ నిర్వహణలో ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా అస్తవ్యస్త పరిస్థితులు కనిపిస్తే సంబంధిత ఎంపీవోలు, కార్యదర్శులపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. బృహత్ పల్లెప్రకృతి వనాల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.