నందిపేట్, డిసెంబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీజేపీ నేత జక్కం పోశెట్టితో పాటు మరికొందరు నాయకులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వారు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గులాబీ కండువాలు వేసి వారిని బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించిన జీవన్రెడ్డి పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. ముదిరాజ్ సంఘానికి ఫంక్షన్హాల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అబద్ధాల కోరు ఎంపీ అర్వింద్ మాయమాటలకు మోసపోయి జక్కం పోశెట్టి తదితరులు బీజేపీ ఇన్చార్జి తరుణ్చుగ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారన్నారు. అయితే బీజేపీకి అంత సీన్ లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్తోనే ముడిపడి ఉందని గ్రహించి పోశెట్టి మూడు నెలలు కూడా తిరగక ముందే తిరిగి బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని విసిరారు. కొత్తగా ఆలూర్, డొంకేశ్వర్లను మండలాలుగా ఏర్పాటు చేయించామన్నారు.
తిరుపతి, యాదాద్రి మాదిరిగా సిద్ధుల గుట్టను పుణ్యక్షేత్రంగా మార్చడానికి సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. ఆర్మూర్-నిజామాబాద్, ఆర్మూర్-ఆలూర్ ఇలా దాదాపు 9 బైపాస్ రోడ్లు వేయించామని వివరించా రు. రూ.130 కోట్లతో ఫత్తేపూర్-చేపూర్-సుర్బిర్యాల్ లిఫ్ట్ చేపట్టామని జీవన్రెడ్డి అన్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తుందని, ప్రతి పల్లెలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ప్రతిఒక్కరి సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వే బాధ్యతగా తీసుకుందన్నారు. ప్రజలంతా పనిచేసే కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలువాలని జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన పోశెట్టి మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ఆదర్శ పాలన నచ్చి పార్టీలో చేరామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, ఎస్ఆర్.రమేశ్, సుంకరి రవి పాల్గొన్నారు.