శక్కర్నగర్, డిసెంబర్ 17: సంపూర్ణ ఆరోగ్యానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుందని, నిత్యం యోగాసనాలు వేస్తే రోగాలు దరిచేరవని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రతీ మనిషి నిత్యం యాంత్రిక జీవనం కొనసాగిస్తూ, ఆహార నియమాలు పాటించక, కలుషిత ఆహారంతో శరీరం రోగాల పుట్టగా మారుతున్నదని, వీటి నివారణకు కేవలం యోగానే సాధనమని యోగా సాధకులు చెబుతున్నారు. భారతదేశంలో యుగాలకు ముందే యోగా ఉందని, పాశ్చాత్య దేశాల పాలనలో యోగాను మరుగున పడేలా చేశారని పలువురు పెద్దలు చెబుతున్నారు. యోగాతో నయంకాని రోగం లేదని, నిత్యం గంటపాటు యోగా చేస్తే ఎలాంటి రోగాలు దరిచేరవని, యోగాను ఆదరించాల్సిన, ఆచరించాల్సిన అవసరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిపై ఉందని యోగా నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, మల, మూత్ర విసర్జన సరిగా లేక రోగాలు సంక్రమిస్తున్నాయని పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ‘యోగా’ కేంద్రాల ఏర్పాటుతోపాటు యోగాపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామంటున్నారు.
ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామంలో ఇప్పటికే యోగా కేంద్రం కొనసాగుతుండగా, నూతనంగా బోధన్- నిజామాబాద్ రహదారి పక్కనే బాపూనగర్ గ్రామ శివారులో యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి ఎడపల్లి, జైతాపూర్, బాపూనగర్తోపాటు బోధన్కు చెందిన పలువురు వస్తున్నారు. యోగా శిక్షక్షుడు సూర కిరణ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రం కొనసాగుతున్నది. ఈ కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో యోగా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని సూర కిరణ్ చెబుతున్నారు.
యోగా నిత్య జీవనంలో ఓ భాగం కావాలి. దీంతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చు. యోగాతో నయంకాని జబ్బులు లేవు. ప్రతి వ్యాధిని యోగాతో నయం చేయవచ్చు. అయితే, ప్రతి వ్యక్తి ఇందుకు సమయం కేటాయించాలి. జిల్లాలో యోగాను విస్తృతం చేయాలనే తపనతో ఇప్పటికే సారంగపూర్, నిజామాబాద్, ఠాణాకలాన్ గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభించాం. ప్రజలు సహకరిస్తే మరిన్ని యోగా కేంద్రాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ప్రభాకర్, యోగరత్న, నిజామాబాద్
యోగా పూర్వకాలం నుంచే కొనసాగుతున్నది. యోగాలో ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, డీప్ బ్రీత్, కపాలభాతి వంటివి ప్రధానంగా అలవర్చుకోవాలి. వీటితో పక్షవాతం, హృదయసంబంధ జబ్బులు దూరమవుతాయి. ప్రతి వ్యక్తి సకాలంలో భోజనం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. యోగాతో మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ అలవడుతుంది. ప్రజలు యోగాపై అవగాహన పెంచుకొని ఆరోగ్యం పరిరక్షించుకోవాలి.
– కిషన్జీ, యోగా థెరపిస్ట్
ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల కోరిక మేరకు బాపూనగర్లో మరో కేంద్రాన్ని ప్రారంభించాం. ప్రజలు సహకరిస్తే మండలంలోని అన్ని గ్రామాల్లో యోగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.
-సూర కిరణ్, యోగా శిక్షకుడు, ఠాణాకలాన్